మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 22: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వన దేవతల జాతర రెండో రోజూ వైభవంగా సాగింది. బుధవారం సారలమ్మను గద్దెపైకి చేర్చగా, గురువారం సాయంత్రం మాతా శిశు దవాఖాన వద్ద ఉన్న ఇల్లారి (గుడి) నుంచి కోయ పూజారులు సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. పోలీసుల బందోబస్తు నడుమ డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో, పటాకలను కాల్చుతూ మేడారం గిరిజన పూజారి కృష్ణ దొర సంప్రదాయ రీతిలో సమ్మక్కను తీసుకువచ్చారు.
భక్తులు పెద్ద సంఖ్యలో వెంట వచ్చారు. వేకువ జామునే గిరి పూజారులు అడవి నుంచి తీసుకవచ్చిన కంకవనాన్ని సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య దంపతులు అమ్మవార్లను దర్శించుకున్నారు. మొదటిరోజు వచ్చి గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవార్లను గద్దెల మీద ప్రతిష్ఠించిన తరువాత ఎత్తు బంగారం (బెల్లం), సీరె, సారె, శివసత్తుల పూనకాలతో, కోళ్లు, మేకలను బలిచ్చి వారి మొక్కులను తీర్చుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించుకున్నారు. అక్కడే వంట చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు.
తల్లుల సేవలో..
భక్తులకు సేవలందించేందుకు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లు, పోలీస్ సిబ్బంది, సేవా కమిటీ సభ్యులు తరలివచ్చారు. భక్తులను క్యూలో పంపించి, తల్లుల దర్శనం కల్పించారు. దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు పలు సూచనలు చేస్తూ జాతర సజావుగా సాగేలా సహకరిస్తున్నారు. జాతర ప్రాంతాన్ని పోలీస్, ఎండోమెంట్, మున్సిపల్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మం చిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు, జాతర ప్రాంతాన్ని డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. పారిశుధ్య చర్యలతో పాటు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా ఆ యా శాఖల సిబ్బంది చర్యలు తీసుకున్నారు.