కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
సల్లంగుండాలని దీవెనలు
ఆదిలాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగు పెట్టుబడి సాయం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. రెండు రోజులుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి రంది లేకుండా పోయిందని, అప్పులు తేవడం మరిచిపోయామని, సకాలంలో పంటలు వేసుకుంటున్నామని, బ్యాంకోళ్లు, ప్రైవేట్ వ్యాపారుల బాధలు తప్పాయని పేర్కొంటున్నారు. కాగా.. ఈ యాసంగికి మంగళవారం నుంచి సర్కారు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుండగా.. మొదటి రోజు ఎకరం, రెండో రోజూ రెండెకరాలు ఉన్న రైతులకు డబ్బులు వచ్చాయి. సాయం అందుతుండడంపై సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతినిధులు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తుండగా.. కేసీఆర్ సల్లంగుండాలని దీవిస్తున్నారు.
వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చిన ప్రభుత్వం పంట పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది యాసంగి పంటల కోసం అవసరమైన సాయాన్ని అందజేస్తున్నది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం జమవుతున్నది. బుధవారం కూడా ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమయ్యాయి. సర్కారు అందిస్తున్న సాయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు. బుధవారం రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లోకేశ్వరం మండలం పుష్పూర్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్.. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సర్కారు అందిస్తున్న రైతుబంధు డబ్బులు తమకు పంట పెట్టుబడులతోపాటు ఇతర వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
ఎవ్వరినీ కలవాల్సిన పనిలేకుండా డబ్బులు..
నాకు మా ఊరి శివారులో ఎకరం పావు పొలం ఉంది. 2018 నుంచి రైతుబంధు పథకం కింద సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందిస్తున్నరు. అంతకు ముందు రైతులందరూ పెట్టుబడి కోసం ఇబ్బంది పడేవారు. సావుకార్ల దగ్గరికి పోయి మిత్తికి డబ్బులు తెచ్చుకొని విత్తనాలు, ఎరువులు కొనుక్కొని పంటలు వేసేవారు. పండిన పంటంతా అసలు, వడ్డీలకే సరిపోయేది. కొందరైతే సాగును వదిలి కూలీ పనులకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. పట్టణాలకు పోయి ఏ పని దొరికితే ఆ పని చేసుకున్నరు. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బతుకులు మారిపోయాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయించారు. ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. రైతు బీమాతో రూ. 5 లక్షలు ఇచ్చి రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నారు. పంటలు కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇస్తున్నారు. దీంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులంతా తిరిగి పల్లెలకు చేరుకొని సంతోషంగా సాగు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే వారు సైతం వచ్చి పొలం పనులు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ సర్కారు వల్లే సాగు సంబురంగా సాగుతున్నది. ఇది వరకు పొలాలన్నీ బీళ్లుగా కనిపించేవి. ఇప్పుడు ఎటు చూసినా పచ్చని పొలాలు కళకళలాడుతున్నాయి. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 6 వేలు ఇవ్వడం బాగుంది. ఇది మంచి నిర్ణయం. ఈ రోజు రైతు బంధు డబ్బులు పడ్డట్లు నా సెల్ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్కు వచ్చి డ్రా చేసుకున్న. ఏ కార్యాలయానికి, ఏ సార్ను దగ్గరకు పోకుం డా నేరుగా మన ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. ఇలా అవినీతికి తావుం డదు. నిజంగా రైతు రాజ్యం అని నిరూపిస్తున్నారు సీఎం కేసీఆర్ సార్.-గురుజాల శ్రీనివాస్, రైతు దహెగాం
అప్పులు తీసుకోవడం బందైంది..
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : మాది రైతు కుటుంబం.. దీనిమీదనే ఆధారపడి బతుకుతున్నం. తెలంగాణ రాకముందు రైతులందరం అరిగోస పడ్డం. కనీసం ఎరువులు కూడా దొరికేటివి కావు. పొద్దుగాల పోయి లైన్లు కట్టేటోళ్లం. ఇగ పంట పెట్టుబడికి మస్తు తిప్పలయ్యేటిది, షావుకారీ దగ్గర అప్పు తీసుకునేది. పంట అమ్మినంక లోన్ కట్టేవాళ్లం. పగలనకా.. రాత్రనకా కష్టపడితే తిండికి కూడా మిగిలేవి కావు. తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారిపోయినయ్. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో చేస్తుండు. ఎవుసానికి 24 గంటలు ఉచితంగా కరెంటిత్తన్రు. సమయానికి ఎరువులు, విత్తనాలు ఇస్తన్రు. పెట్టుబడికి రంది లేకుంట ఎకరానికి రూ. 5 వేలు ఇచ్చుడంటే ఆషామాషీ కాదు. నాకు ఐదెకరాల భూమి ఉంది. పత్తి, జొన్న, కంది పంట వేస్త. నాకు 2018 నుంచి రైతు బంధు డబ్బులస్తున్నయ్. ఏడాదికి రూ. 50 వేలు ఇస్తన్రు. గీ పైసలతో పెట్టుబడి వెళ్తుంది. బయట అప్పులు తీసుకోవడం బందైంది.-సిడాం పగ్గు, రైతు, కొలాంఝరి, కెరమెరి
ఇది వరకు పట్టించుకున్నోళ్లు లేరు
చెన్నూర్, డిసెంబర్ 29 : మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇస్తున్న రైతుబంధు డబ్బులు ఎవుసానికి అక్కరకు వస్తున్నయ్. నాకు మా ఊరిలో రెండెకరాల పొలం ఉంది. ఈ ఏడు వానకాలంలో రూ 10 వేలు, ఈ యాసంగికి రూ. 10 వేలు వచ్చినయ్. డైరెక్టుగా నా బ్యాంకు ఖాతాల్నే జమ చేసిన్రు. బ్యాంకుకు పోయి తీసుకున్న. తెలంగాణ రాక ముందు రైతులను పట్టించుకున్నోళ్లు లేకుండే. ఎవుసం చేసుడంటేనే ఏడుపొచ్చేది. ఎవుసం మొదలు పెట్టేటప్పుడు విత్తనాలు, ఎరువులు, మందులు కొనుక్కోవడానికి సావుకార్ల దగ్గరికి పైసల కోసం పోయేటిది. పంట పండిన తర్వాత వడ్డీతో సహా ఆసామికి అప్పు కట్టేది. ఎవుసంలో లాభం లేక కొందరైతే బంద్ చేసి కూలీ పనులకు పోయిన్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిండు. ఆయనకు కూడా ఎవుసం ఉంది. రైతులకు ఎన్ని కష్టాలుంటయో తెలిసినోడు. అందుకే మస్తు మంచి పనులు చేస్తున్నడు. రైతుబంధు పథకం పెట్టి ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ.5 వేలు ఇస్తున్నడు. వానకాలం, యాసంగికి రెండుసార్లు పైసలిస్తున్నడు. గా పైసలతో విత్తనాలు, ఎరువులు, మందులు కొనుక్కుంటున్నం. ఎవ్వరైనా చనిపోతే రైతు బీమా కింద వాళ్ల కుటుంబానికి రూ. 5 లక్షలు కూడా ఇస్తున్నడు. ఇగ గింత మంచిగా ఎవ్వరూ పాలన చేస్తరు. అందుకే ఎప్పటికీ గీ కేసీఆర్ సారే సీఎంగా ఉండాలే. – బైరి ప్రసాద్, కొమ్మెర
బతుకులు మంచిగైనయ్..
నాపేరు కేమ మాధవ్. నాది తాంసి మండలం పొన్నారి. నాకు రెండెకరాల భూమి ఉంది. ఏటా రెండు దఫాలకు కలిపి రూ.20వేల పెట్టుబడి సాయం వస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం నాకు రైతు బంధు కింద రూ.80 వేలు ఇచ్చింది. మన రాష్ట్రం అచ్చినంక మాలాంటి రైతుల పరిస్థితి మంచిగైంది. గింతకు ముందు ఏ సర్కారుకూడా రైతులను పట్టించుకున్న పాపానపోలే. కానీ సీఎం కేసీఆర్ సార్ వచ్చాక రైతుల బతుకులు మంచిగైనయ్. ఇయ్యాల కూడా రైతుబంధు పైసలు అచ్చిన మెసేజ్ నాకొడుకు ఫోన్కు వచ్చింది. మా ఉళ్లో మస్తుమంది పత్తి వేస్తరు. పెట్టుబడి ఖర్చులు ఎక్కువుంటయ్. రైతుబంధు పథకం వచ్చినంక రైతు రంది తీరింది. దళార్ల దగ్గర వడ్డికి గింజలకు, మందులకు తీసుకునేది.ఇప్పుడు ఆ బాధ తప్పింది. నగదు ఇచ్చి మాకు కావాల్సిన మందులు, గింజలు, పురుగు మందులు కొనుక్కుంటున్నం. అట్లనే నాకు చేనులో బోరుబావి ఉంది. యాసంగిలో కూరగాయలు వేసిన. గోధుమ, జొన్న పొయాలనుకుంటున్న. గీ పైసలను ఈ పంటలకే ఖర్చు పెడతా. కేసీఆర్ సార్ హయాంలో రైతులకు మస్తు మంచి జరుగుతున్నది.
దేవునోలే కేసీఆర్ ఆదుకుంటున్నడు
కౌటాల, డిసెంబర్ 29 : నాకు కౌటాల శివారులో 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదట్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకం రాలే. 3 ఏండ్ల కింద సర్కారోళ్లు కొత్త పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చిన్రు. మూడేండ్ల సంది రైతుబంధు డబ్బులు నా బ్యాంకు ఖాతాలో పడుతున్నయ్. ఇది వరకున్న గవర్నమెంటోళ్లు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. కరంటు ఉంటే.. నీళ్లుండకపోయేటివి.. విత్తనాలు, ఎరువుల కోసం మస్తు తిప్పలయ్యేది. ఇగ పెట్టుబడి కోసం సావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లం. ఎట్లనో అట్ల పంట వేసినా.. దిగుబడి మొత్తం వడ్డీలకే సరిపోయేవి. మస్తు మంది ఇగ గీ ఎవుసం చేయలేమని పట్టణాలకు పోయినోళ్లు ఉన్నరు. తెలంగాణ వచ్చి కేసీఆర్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బాధలన్నీ పోయిన య్. రైతులను దేవునోలే ఆదుకుంటు న్నడు. ఈసారి కూడా నా ఖాతాల రైతుబంధు డబ్బులేసిన్రు. బ్యాంకుకు పోయి తెచ్చుకున్న. పొలం దున్నడానికి గీ పైసలు అక్కరకు వస్తయ్. ఇగ విత్తనాలు, ఎరువులు కొనుక్కుంట. మమ్ముల ఆదుకుంటున్న కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటం.