ఆరు నెలల క్రితం ఓ వివాహిత భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బాధిత మహిళ నిర్మల్ సఖీ కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్రం సిబ్బంది భర్త, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్త మారి అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నాడు. నిర్మల్కు చెందిన మహిళకు మహారాష్ట్రకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అక్కడ అత్తగారింట్లో నిత్యం మానసిక వేధింపులకు గురయ్యింది. బాధితురాలు నిర్మల్లోని సఖీ కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్రం సిబ్బంది బాధిత మహిళ భర్త, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తకు నచ్చజెప్పారు. భర్త అర్థం చేసుకొని నిర్మల్కు వచ్చి ఇక్కడే జీవనోపాధి వెతుక్కొని కలిసిమెలిసి ఉంటున్నారు.
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 13 : వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖీ కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. సమస్యలు తెలుసుకొని సత్వరమే వారికి సాయం అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి. అఘాయిత్యాలు, అన్యాయాలకు గురైన మహిళలు, గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, పోక్సో, మిస్సింగ్, చీటింగ్, ప్రేమ పేరిట వేధింపులు, వరకట్నం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కేంద్రాలకు వస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సఖీ కేంద్రం ఏర్పాటు చేయగా.. ప్రారంభించిన నుంచి ఇప్పటివరకు 970 కేసులు వచ్చాయి. అందులో 886 కేసులు పరిష్కరించగా.. 84 పెండింగ్లో ఉన్నాయి. అంతేగాక కేంద్రం అందిస్తున్న సేవలపై గ్రామాలు, పట్టణాల్లో మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఐదు రకాల సేవలు
బాధిత మహిళలకు సఖీ కేంద్రాల నుంచి ఐదు రకాల సేవలు అందిస్తున్నారు. వైద్య సహాయం, తాత్కాలిక వసతి, న్యాయ సలహా, కౌన్సెలింగ్, పోలీస్ రక్షణ వంటి సేవలు అందిస్తున్నారు. వీటితోపాటు పగలు, రాత్రి కాని బాధిత మహిళలు భయానక పరిస్థితుల్లో ఉంటే తక్షణమే తమ వాహనంలో వెళ్లి సఖీ కేంద్రానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు.
రాజీ ద్వారా సమస్యలు పరిష్కారం..
సఖీ కేంద్రాలకు వచ్చే వారిలో గృహహింస, భార్యాభర్తల మధ్య తగాదాలు, మనస్పర్థలు, వరకట్నం, అత్తామామల వేధింపులు, ఆడబిడ్డలు, తోటికోడళ్లతో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. బాధిత మహిళలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇబ్బందులకు గురిచేస్తున్న గృహహింస చట్టంపై అవగాహన కల్పించి చట్టం ద్వారా విధించే శిక్షల గురించి వివరిస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధిత మహిళకు బాసటగా నిలుస్తున్నారు.
వెంటనే స్పందిస్తున్నాం..
బాధిత మహిళలు ఫోన్ ద్వారా ఏ సమయంలోనైనా సమాచారం అందించిన వెంటనే స్పందిస్తున్నాం. వారికి తగిన రక్షణ కల్పించి న్యాయం చేకూరుస్తున్నాం. భర్త, అత్తా మామలు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని పలువురు మహిళలు ఫోన్ చేస్తుంటారు. వెంటనే స్పందించి సఖీ కేంద్రం వాహనంలో తీసుకొచ్చి వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం. మరుసటి రోజు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వారి సమస్యను పరిష్కరిస్తున్నాం. కేసు వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటుగా బాధితులకు కావాల్సిన పోలీసు, వైద్య, న్యాయ సహాయం అందిస్తున్నాం.
– మమత, సఖీ కేంద్రం నిర్వాహకురాలు, నిర్మల్