మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నంనూర్కు చెందిన కారుకురి రాంశంకర్కు 30 గుంటల భూమి ఉంది. ఈ భూమిని సాగు చేస్తూ, కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇల్లు, జాగ ముంపునకు గురైతే.. 2015లో పునరావాసం కింద రాష్ట్ర ప్రభుత్వం రెండు గుంటల భూమి ఇచ్చింది. ఇందులో ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అంతా సాఫీగా సాగి పోతుందనుకున్న క్రమంలో రాంశంకర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షలు చేయించగా లివర్ క్యాన్సర్ అని తేలింది. రూ.10 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించినా బతకలేదు. 2022 ఏప్రిల్లో ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. ఇలా ఉన్న ఒక మగ దిక్కును కోల్పోయి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు కేసీఆర్ సారు కొండంత అండగా నిలిచారని రాంశంకర్ భార్య బక్కమ్మ తెలిపింది. చనిపోయి నెల రోజులు కాకముందే ‘రైతు బీమా’ కింద రూ.5 లక్షలు ఖాతాలో పడ్డాయని, అప్పులు తీర్చుకున్నామని కన్నీటి పర్యంతమైంది.
ఇంకా.. మిగిలిన అప్పులు తీర్చేందుకు రోజూ కూలీ పనులకు వెళ్తోంది. మొన్ననే సీఎంఆర్ఎఫ్ కింద మరో రూ.2 లక్షలు వచ్చాయి. ఇవి కట్టగా.. మిగిలిన అప్పులు కూలోనాలో చేసి కడతాని తెలిపింది. తమ కూతురు శరణ్య ఏడో తరగతి చదువుతుండగా.. గతేడాది గురుకులంలో సీటు కూడా వచ్చింది. కానీ.. రాంశంకర్ చనిపోవడంతో జాయిన్ చేయలేదు. ఈసారి మళ్లీ పరీక్ష రాసింది. సీటు ఇప్పిస్తే బిడ్డను చదివించుకోవడం సులభమవుతోందని తెలిపింది. కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కారుకు జీవితాంతం రుణపడి ఉంటామని రాంశంకర్ భార్య బక్కమ్మ పేర్కొంటోంది. ఇలా రాంశంకర్ లాంటి 8,315 రైతు కుటుంబాలను రైతుబీమా ఆదుకుంది. దాదాపు రూ.415.75 కోట్లు ఆ కుటుంబాలకు చేరింది. రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి నేటికి ఐదేండ్లు పూర్తవుతున్నది.
– మంచిర్యాల, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)