రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. రైతన్న కుటుంబానికి ఏ కష్టం రావొద్దని, వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తూ సాగుకు భరోసానిస్తున్నది. వివిధ కారణాలతో రైతు మరణిస్తే, బాధిత కుటుంబానికి రైతుబీమా ద్వారా కొండంత అండగా నిలుస్తున్నది. నిర్మల్ జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 2934 మంది రైతులు మరణించగా, ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున రూ. 146.70 కోట్లను అందజేసింది. జిల్లాలో ఇప్పటివరకు 1,02,526 మందికి రైతు బీమా ప్రీమియం కట్టగా, కొత్తగా 9684 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల 5వరకు దరఖాస్తులకు గడువు ఉండగా, వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని సర్కారు భావిస్తున్నది.
నిర్మల్, జూలై 14(నమస్తే తెలంగాణ) : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. మొదటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి ఏ కష్టం రావొద్దని.. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. రైతుబంధుతో పంట పెట్టుబడి సాయం అందిస్తూనే, రైతు బీమా ద్వారా వివిధ కారణాలతో మృతిచెందిన రైతుల కుటుంబాలకు సైతం అండగా నిలుస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడి కోసం రెండు పంటలకు యేటా ఎకరానికి రూ.10వేలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. వానకాలం పంట పెట్టుబడి కోసం ఇటీవలే రైతుబంధు సాయాన్ని అందించిన ప్రభు త్వం.. రైతు బీమా కోసం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. రైతు బీమా ద్వారా ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే బాధిత కు టుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రూ.5 లక్షలు అందిస్తూ బతుకుపై భరోసానిస్తున్నది. నిర్మల్ జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 2,934 మంది రైతులు మృతిచెందగా, వారి కుటుంబాలకు రైతుబీమా కింద రూ. 146.70 కోట్లను అందజేసింది. అందరికీ అ న్నం పెట్టే రైతన్నతో పాటు, వారి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మొదటి నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారు.
జిల్లాలో రైతుబీమా కింద 1,02,526 మంది రైతులు ఉన్నారు. కాగా, ఈ ఏడాది కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన వారి నుంచి రైతుబీమా కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతంలో రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని, కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు వచ్చే నెల 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏఈవోలు ధరణి ఆధారంగా కొత్త రైతులను గుర్తిం చి, వారి ఇంటికే వెళ్లి రైతుబీమా ఫారాలను సేకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మరో 9, 684 మంది రైతులు కొత్తగా రైతుబీమా దరఖా స్తు చేసుకున్నారు. కాగా, ఒక్కో రైతుకు రూ. 3,475 చొప్పున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇదిలా ఉంటే వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇతర రాష్ర్టాల్లో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడతుంటే మన రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుండడం గమనార్హం. అలాగే రైతు లు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రూ.10వేల చొప్పున రెండు పంటల కోసం పెట్టుబడి సాయాన్ని నేరు గా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నది.
ఐదేండ్లలో రూ.146.70 కోట్ల సాయం..
రైతుబంధుతో పాటు, రైతు కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతు కుటుంబాల్లోని పెద్దదిక్కు మరణిస్తే వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి కుటుంబాలను అప్పుల బారి నుంచి కాపాడడమే కాకుండా బాధిత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఆదుకుంటున్నారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు మొదట్లో రూ.5 లక్షల బీమా డబ్బులను బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం.., తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నది. కాగా, ఈ పథకాన్ని 2018, ఆగస్టు 15న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నాటి నుంచి 2018లో 545 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.27.25 కోట్లను అందజేసింది. అలాగే 2019లో 512 రైతు కుటుంబాలకు రూ.25.65కోట్లు.., 2020లో 694 రైతు కుటుంబాలకు రూ. 34.70కోట్లు.., 2021లో 613 రైతు కుటుంబాలకు రూ.30.65 కోట్లు.., 2022లో 570 రైతు కుటుంబాలకు రూ.28.50 కోట్లను అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 1,75,600 మంది రైతులు ఉండగా, వీరిలో 1,02,526 మంది రైతులు రైతు బీమాకు అర్హులుగా వ్యవసాయ శాఖ యంత్రాంగం గుర్తించింది. దీంతో ఈ ఏడాది రైతు బీమా కోసం సుమారు 35.63 కోట్ల ప్రీమియం ప్రభుత్వం చెల్లించింది.
పెరిగిన పాలసీదారులు..
యేటా రైతుబీమా లబ్ధిదారులు పెరుగుతున్నారు. ఈ సారి కొత్తగా 9,684 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,934 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా, వారి కుటుంబాలకు రైతుబీమా కింద రూ.146.70 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతుబీమా కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నం. కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు వచ్చే నెల 5వ తేదీలోగా రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. యేటా రైతుబీమా కొత్త లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నది. ఈ వానకాలం పంటల సాగు ప్రణాళికను ఇప్పటికే రూపొందించాం. ఆ దిశగా క్షేత్రస్థాయిలో తమ సిబ్బంది రైతులకు పంటల సాగుపై దిశా నిర్దేశం చేస్తున్నారు. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, నిర్మల్