చింతలమానేపల్లి, ఫిబ్రవరి 3: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో ఓ ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా వీల్రాడ్డు విరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కర్జెల్లి, గూడెం ప్రధాన రహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ29జడ్2076) మహారాష్ట్రలోని అహెరికి వెళ్లి తిరిగి డిపోకు వస్తోంది. కర్జెల్లి దాటిన తర్వాత ఒక్కసారిగా బస్ స్టీరింగ్కు అనుసంధానంగా ఉండే వీల్ రాడ్డు విరిగి పోయింది. దీంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 55 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానీ డ్రైవర్ ప్రభాకర్ చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేసి బస్సును నిలిపివేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.