మందమర్రి, మే 24 : రైతులు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. మరికొ న్ని రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉండడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యా రు. వేసవి దుక్కులు దున్నిస్తే పంటల సాగుకు అన్ని విధాలా ప్రయోజనముంటుందని రైతు లు భావిస్తున్నారు. మందమర్రిలోని నార్లాపూర్, ఊరు రామకృష్ణాపూర్, ఎర్రగుంటప ల్లి, ఊరు మందమర్రి, చొప్పరిపల్లి, చతులాపూర్ గ్రామాల రైతులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నించి, భూములను సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సుమారు 480 రై తు కుటుంబాలుండగా, సుమారు 1500 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.
గ్రామాల సమీపంలోని చెరువుల ఆయకట్టు రైతులతో పాటు బోర్లు, విద్యుత్ సౌకర్యం ఉన్నవారు వరి సాగుకు సమాయాత్తమవుతుండగా, వర్షాలపై ఆధారపడే వారు పతి,్త మక్క లాంటి ఆరుతడి పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా గ్రామాల్లో యేటా 500 ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా, 800 ఎకరాలలో పత్తి వేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు సుమారు 200 ఎకరాల్లో కూరగాయలు, పప్పు ధాన్యాలు పండిస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు అనుకూలిస్తే పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దుకాణాల్లో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని, మేలు రకం విత్తనాలను వేయాలని అవగాహన కల్పిస్తున్నారు. పంట మార్పిడి విధానం పాటించి, అవసరమైన మేరకు ఎరువులు వాడాలని, సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురిసిన వెంటనే భూసారాన్ని పెంచేందుకు జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన రైతులు కార్యాయంలో సంప్రదించి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.