ఎదులాపురం, సెప్టెంబర్ 29 : దసరా నుంచి కొత్త పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో, నేరుగా పోస్టాఫీస్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనార్దన్రెడ్డి గార్డెన్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15,474 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు.
వారి కోసం రూ. 3,17,12,584 కేటాయించామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఖాతాల్లో లేదా దసరా కానుకగా వారికి చేతికి అందిస్తామన్నారు. ఇది వరకు పట్ణణంలో 14,148 మంది లబ్ధిదారులు ఉండగా పట్టణంలో కొత్తగా 2737 మందికి ఆసరా పింఛన్ కార్డులు అందజేశామని తెలిపారు. వారి కోసం రూ.56,20,792 డబ్బులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు అజయ్, శ్రీలత, పవన్ నాయక్, భరత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.