మంచిర్యాల, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు బీఆర్ఎస్ సర్కారు మరోసారి తీపికబురు అందించింది. ఇంతకు ముందే వారి శ్రమను గుర్తించి సీఎం కేసీఆర్ వేతనాలు పెంచి, గౌరవాన్ని కల్పిస్తూ టీచర్లు అని సంబోధించాలని జీవో జారీ చేశారు. 30 శాతం ఫిట్మెంట్ వర్తింప జేశారు. వీటికితోడు తాజాగా రిటైర్మెంట్ వయసును 65 ఏండ్లకు పెంచడంతోపాటు ఉద్యోగ విరమణ బెనిఫిట్గా టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఉమ్మడి పాలనలో గుర్తింపు లేని తమకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత గౌరవం కల్పిస్తున్నారని టీచర్లు, హెల్పర్లు సంబురపడుతున్నారు. తాజా నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 6,455 మందికి ప్రయోజనం కలుగనున్నది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు మరోసారి అండగా నిలిచింది. ఇప్పటికే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు అత్యధిక వేతనాలు ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. తాజాగా వారి రిటైర్మెంట్ వయసును 65 ఏండ్లకు పెంచింది. దీంతోపాటు ఉద్యోగ విరమణ బెనిఫిట్గా టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయడంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సంబురపడుతున్నారు. దశాబ్దాలుగా మినీ అంగన్వాడీలుగానే ఉండిపోయిన కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం, రిటైరయ్యాక ఆసరా పింఛన్లు ఇస్తామనడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలనలో ఎలాంటి గుర్తింపు లేని తమకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారని, 2015లోనే అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.4,200 నుంచి రూ.7 వేలకు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనం రూ.2,200 నుంచి రూ.4,500లకు పెంచి గొప్ప మనసును చాటుకున్నారంటున్నారు. అనంతరం 2017లో ప్రగతి భవన్కు పిలిపించుకొని మా సాధక బాధకాలు తెలుసుకున్న సీఎం మరోసారి టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.6 వేలకు పెంచడం గొప్ప విషయమన్నారు. 2021లో టీచర్ల వేతనం రూ.13,650, హెల్పర్ల వేతనం రూ.7,800లు చేసి సమాజంలో మా కంటూ ఓ స్థానం కల్పించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం ఫిట్మెంట్ను వర్తింప చేసి అంగన్వాడీల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అన్నింటికీ మించి అంగన్వాడీలను వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలనే ఆదేశాలు జారీ చేసి మా గౌరవాన్ని పెంచారని, తాజా నిర్ణయాలతో అంగన్వాడీ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్నారు.
అమూల్యమైన వరం ఇచ్చిన్రు..
ఎదులాపురం, ఆగస్టు 26: అంగన్వాడీ సిబ్బందికి సీఎం కేసీఆర్ అమూల్యమైన వరాలు ఇచ్చిన్రు. గతంలో మా ఇబ్బందులను ఏ ఒక్కలూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ సర్కారు వచ్చినంకనే మాకు జీతాలు పెంచిన్రు. ఇప్పుడు వయోపరిమితి కూడా పెంచిన్రు. రిటైర్మెంట్ తర్వాత కార్యకర్తలకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇక ప్రతి కార్యకర్త, ఉత్సాహంగా పని చేసుకునే అవకాశం కల్పించిన్రు. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– ప్రియాంక, అంగన్వాడీ కార్యకర్త,శాంతాపూర్, గుడిహత్నూర్
ప్రభుత్వానికి రుణపడి ఉంట..
నా పేరు జొందళే చక్రవతి. జైనూర్ మండలంలోని పవర్గూడలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న. గతంలో ఎన్నో రోజులు జీతాలు పెరుగుతయని ఎదురు చూసిన. ఇప్పుడు మాకు ప్రభుత్వం రూ. 13,650 వేతనం పెంచింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంట. నేను ఉద్యోగంలో చేరినప్పుడు నాకు రూ.150 మాత్రమే ఇస్తుండే. ప్రజాప్రతినిధులు ఐసీడీఎస్ సార్లు, గ్రామస్తుల సహకారంతో గర్భిణు లు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికా హారం సమయానికి ఇస్తున్న. అప్పట్లో జీతం తక్కువుండి ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు మా కష్టాన్ని సర్కారు గుర్తించింది. మాకు జీతాలు పెంచి, ఉత్సాహంగా పనిచేసేలా సీఎం కేసీఆర్ చేసిండు.
ఆనందంగా ఉంది..
మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలు గా అప్గ్రేడ్ చేయడం ఆనం దంగా ఉంది. 15 ఏళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సీఎం కేసీఆర్ మా బాధలను అర్థం చేసుకున్నరు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు మాకు మేలు చేసేలా ఉన్నాయి. మా విష యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఎంతో చొరవ చూపిన్రు. సీఎం దృష్టికి సమస్యలన్నీ తీసుకెళ్లిన్రు. ఇప్పుడు మాకు మంచి జరిగిం ది. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకో లేదు. రిటైర్మెంట్ బెన్ఫిట్స్తోపాటు ఆసరా పింఛను కల్పించడం సంతోషంగా ఉంది. కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటం.
– నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్, మందపల్లి
అంగన్వాడీలకు పర్వదినం
అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. కార్యకర్తలు, ఆయాల జీతాలు పెంచడంతో విధులు సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతున్నాం. ఇప్పుడు వయో పరిమితి పెంచడం, రిటైర్మెంట్ తర్వాత లబ్ధి చేకూర్చడం, మినీ అంగ న్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం సంతోషకరం. ఒకప్పుడు ఆంధ్ర సర్కారు హయాంలో అసలు అంగన్వాడీలను అడిగినవారు లేరు. చాలీచాలని వేత నాలతో పనిచేసేవారం. పిల్లలకు ఆటాపాటలతో అక్షరాలు నేర్పుతూ బడిబాట పట్టించే అంగ న్వాడీలను సీఎం కేసీఆర్ సార్ పట్టించుకోవడం మరిచిపోలేం. సర్కారు ఈ ప్రకటన చేసిన రోజు అందరికీ పర్వదినమే అయ్యింది.
– బీ సునీత, అంగన్వాడీ కార్యకర్త, కరంజి(టీ), భీంపూర్