మంచిర్యాల, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రంగంపేట శివారులో ఎనిమిది ఎకరాల్లో అనధికారిక వెంచర్ వెలియగా, శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘అక్రమాల శ్రీరంగం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. డీటీసీపీ అనుమతులు తీసుకోకుండా, టీపీ(టెంటిటేటివ్ లే-అవుట్) పర్మిషన్ లేకుండా ప్లాట్లు చేసి.. అన్ని అనుమతులున్నాయంటూ ‘శ్రీరంగం హిల్స్ బై అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్’ సంస్థ విక్రయాలకు సిద్ధమైందని, దాదాపు రూ.30 లక్షలు ఖర్చు పెట్టి రంగంపేట చిన్నకుంట చెరువు కట్టపై నుంచి వెంచర్ వరకు అనధికారికంగా రెండు కిలోమీటర్ల మేర రోడ్డు వేసిందని అందులో పేర్కొనగా, యంత్రాంగం సీరియస్గా తీసుకున్నది. కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు వెంచర్ను, చెరువు కట్టపై వేసిన రోడ్డును శనివారం ఉదయాన్నే పరిశీలించారు. తహసీల్దార్ రమేశ్.. వెంచర్ నిర్వాహకులైన నీలి శ్రీనివాస్ను సంప్రదించి.. సంబంధిత డాక్యుమెంట్లు తీసుకురావాలని కోరారు. ఇందుకు ఆయన హోమంలో ఉన్నానని, సాయంత్రం వస్తానని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.
నాలా కన్వర్షన్ ఎన్ని ఎకరాలకు ఉంది. వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేశారు. నిర్వాహకుల పేరుపై ఎంత భూమి ఉంది.. మిగిలిన వ్యవసాయ భూమి ఎవరి పేరుపై ఉందనే వివరాలు తెలుసుకున్నాక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపా రు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుం డా చెరువు కట్టపై నుంచి రోడ్డు వేయడంపై ఇరిగేషన్ శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. రోడ్డును పరిశీలించిన ఇరిగేషన్ ఏఈ గౌతమ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు బాధ్యులకు నోటీసులు ఇస్తామని చెప్పారు. మున్సిపాలిటీకి దరఖాస్తు చేయకుండా డీటీసీపీ లే-అవుట్ అంటూ విక్రయాలు చేస్తుండడం, టీపీ పర్మిషన్ తీసుకోకుండా ప్లాట్లు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ సూచించినట్లు మున్సిపల్ కమిషన్ మారుతీప్రసాద్ తెలిపారు. కోర్టు కేసు విషయమై టౌన్ప్లానింగ్ అధికారులు హైదరాబాద్ వెళ్లారని, రాగానే వెంచర్ను పరిశీలించి తగు చర్యలకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ వెంచర్ పక్కన అటవీశాఖ భూములున్నట్లు తెలిసింది. ఈ లెక్కన సదరు వెంచర్ నిర్వాహకులు అటవీశాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుందని తెలిసింది.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే శ్రీరంగం హిల్స్ వెంచర్కు వెళ్లాలంటే చెరువు కట్ట మార్గం తప్ప.. ప్రత్యామ్నాయం లేదు. ఈ వెంచర్ పక్కనుంచే నేషనల్ హైవే -63 ప్రతిపాదిత రోడ్డు వెళ్తుంది. అది పూర్తయితే ఈ భూమి హాట్ కేక్లా మారుతుంది. కాకపోతే ఆ లోగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో కట్టపై రోడ్డు వేసినట్లు తెలుస్తున్నది. సాధారణంగా ఏ చెరువు కట్ట అయినా.. ఎడ్లబండి వెళ్లేంత బాట (10 ఫీట్ల నుంచి 13 ఫీట్లు) ఉండాలి. కానీ దాన్ని దాదాపు 20 ఫీట్లకు పెంచారు. ఇందుకోసం కొంత వరకు చెరువును లోపలి నుంచి పూడ్చుకుంటూ వెళ్లారు. కట్టకు ఇరువైపులా చెట్లను సైతం నరికివేశారు. విచిత్రం ఏమిటంటే చెరువు తూమును దాటి రోడ్డు వేశారు. సాధారణంగా ఏ కట్టపైనైనా తూము ముందుకు ఉంటుంది. కానీ.. స్వలాభం కోసం దాన్ని దాటి రోడ్డు వేశారు. ఈ విషయాలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నిబంధనలు అతిక్రమించిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారా.. లేక నామమాత్రంగా నోటీసులు ఇచ్చి సరిపెడతారా.. అనేది చూడాల్సి ఉంది.