కడెం, జూలై 12 : గతేడాది భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2022, జూలై 12వ తేదీన ఎన్నడూ లేనివిధంగా సామర్థ్యానికి మించి, ప్రవాహం రావడంతో ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి నెలకొన్నది. అప్పుడు 10 రోజులు నిరంతర వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 5 లక్షలకు పైగా ఇన్ ఫ్లో వచ్చింది. ప్రాజెక్టుకు 18 వరద గేట్లు ఉండగా, 2వ నంబర్ గేటు తెరుచుకోలేదు. ఆ కారణంగా గేట్ల మీద నుంచి వరద పారింది. ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదానికి చేరుకున్నది. దీంతో ఆయకట్టు కింది 15 గ్రామాలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించారు. ఇదే క్రమంలో ప్రధాన కాలువ వద్ద భారీ గండి పడడంతో ముప్పు తప్పింది. ఈ విలయం జరిగి ఏడాది పూర్తికాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ వరదల కారణంగా కడెం, దస్తురాబాద్ మండలాల్లోని దాదాపు 15 గ్రామాలను అధికారులు అప్రమత్తం చేస్తూ, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కాగా, కుడి కాలువ గండితో ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. కానీ, రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు. అలాగే వరదగేట్ల మీది నుంచి నీరు ప్రవహించడంతో నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారి తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత వాహనాలను కడెం జలాశయం రహదారి నుంచి కొద్దిరోజుల రాకపోకలను మళ్లించి, రోడ్డు పనులు ప్రారంభించారు.
నెల వ్యవధిలోనే పనులు పూర్తి..
భారీ వరదతో అటు ప్రాజెక్టు, ఇటు రహదారికీ తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక నిధులు విడుదల చేసింది. మ్యానువల్ గేట్ల వల్ల అత్యవసర సమయంలో ఓపెన్ చేసేందుకు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నూతన టెక్నాలజీ ద్వారా గేట్లు తెరిచేలా పనులు చేపట్టింది. చీతాస్ కంట్రోల్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ పూణే నుంచి సామగ్రి తెప్పించి, యూపీ ఇంజినీర్ల ద్వారా పనులు పూర్తి చేయించింది. గేట్లకు మరమ్మతులు చేసి, వానాకాలం పంటలకు డిస్ట్రిబ్యూటరీ-65 వరకు సాగునీటిని అందించింది. రైతాంగానికి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి, సాగుకు ఇబ్బందుల్లేకుండా చేసింది. అలాగే నిర్మల్-మంచిర్యాల జిల్లాలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా కడెం ప్రాజెక్టుపై నుంచి వాహనాలను పంపిస్తూ, నెల వ్యవధిలోనే ప్రధాన రహదారి మరమ్మతులు పూర్తి చేసింది. ఈ పరిస్థితులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, అప్పటి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, ఆర్అండ్బీ ద్వారా పనులు చేపట్టారు.