ఆసిఫాబాద్, ఫిబ్రవరి 20 : జిల్లా కేంద్రంలో ఉన్న బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లో నిత్యం 3 వేల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతున్నది. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, కాగజ్నగర్, సిర్పూర్(టీ) మండలాలతో పాటు, మంచిర్యాల జిల్లా తాండుర్ మండలానికి చెందిన 480 మంది రైతుల నుంచి పాలను సేకరించి, ఇక్కడికి తరలిస్తారు. ప్యాకింగ్ కోసం లక్షెట్టిపేట్కు తరలిస్తారు. రైతులకు లీటర్కు వెన్న శాతాన్ని బట్టి రూ.40 నుంచి రూ.80 వరకు ధర నిర్ణయిస్తారు.
30 రోజులు గడిచినా..
పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేసీఆర్ సర్కారు అనేక చర్యలు చేపట్టింది. విజయ డెయిరీ సహకారంతో పాడి రైతుల నుంచి పాలు సేకరించి, వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా పక్షం రోజులకోసారి పాల డబ్బులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు. కానీ, ప్రస్తుతం 30 రోజులు గడిచినా డబ్బులు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.30 లక్షలు పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
రైతులకు అందని ప్రొత్సాహం..
రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన పాల వెన్నశాతంతో ధర నిర్ణయించడంతో ఆ ధరతో పాటు ప్రతీ లీటర్కు రూ.4 ప్రోత్సా హం అందించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కానీ, అది అమలు కావడం లేదు. దీంతో రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. ముద్ర పథకం ద్వారా గతంలో ప్రతి రైతుకూ రెండు బర్రెల కోసం రుణాలు ఇప్పించారు. 42 మంది రైతులు ఇందులో లబ్ధిపొందారు. మొదట్లో నిత్యం వెయ్యి లీటర్ల వరకు సేకరణ జరుగగా, ప్రస్తుతం 3 వేలకు పెరిగింది.
పని చేయని పోర్టల్…
కేంద్రానికి పాలు అందజేసే రైతుల వివరాలను ఈ-ల్యాబ్ పోర్టల్లో నమోదు చేసి.. వారికి రావాల్సిన ప్రోత్సాహం అందిస్తారు. అయితే, గత కొద్ది రోజలుగా పోర్టల్ పని చేయకపోవడంతో రైతులకు నష్టం జరుగుతున్నది. ఈ-పోర్టల్లో రైతుల వివరాలు నమోదు చేస్తే రైతు కుటుంబంలో ఆడ బిడ్డ పెళ్లికి రూ.5 వేల సాయం అందించనున్నారు. అలాగే రైతు మృతిచెందితే వారి కుటుంబానికి దహన సంస్కార ఖర్చుల కోసం రూ.5 వేలు అందజేస్తారు. పోర్టల్లో వారి వివరాలు లేకపోతే రైతులకు ఏ రాయితీ అందే అవకాశం కూడా ఉండదు. ఈ-ల్యాబ్ పోర్టల్ను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.