ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 7: అర్హులైన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్లో ఉన్న ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బుధవారం ఓటరు నమోదుపై ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డితో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిందని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన యువతీ యువకుల పేర్లను 100 శాతం ఓటరు జాబితాలో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారి జాబితా సిద్ధం చేసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలని, వారందరి పేర్లు జాబితాలో ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. మరణించిన, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను నిర్ణీత ఫారాల్లో వివరాలు సేకరించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఆయా సంబంధీకుల నుంచి తీసుకొని నమోదు చేయాలన్నారు. ముఖ్యులు, మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు తప్పిపోకుండా చూడాలని, దివ్యాంగులను ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు ఎలక్ట్రోరల్ మార్కింగ్ చేయాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు అర్హులైన వారిని గుర్తించి ఓటర్లుగా పేర్లు నమోదు చేయాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాని సూచించారు. ఓటర్ల తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలు బూత్ స్థాయిలో అందుబాటు లో ఉంచాలన్నారు. అర్హుల జాబితాకు అనుగుణం గా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఆధార్ సీడింగ్, రిజిస్టర్ల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న రిజిస్టర్లు, రికార్డులు, ఫారాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో కదం సురేశ్, తహసీల్దార్ భోజన్న, ప్రిన్సిపాల్ స్వామి, బూత్ స్థాయి సూపర్వైజర్లు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.