చెన్నూర్ టౌన్ : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనుగోలుచేసి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని (Ration rice) అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. రూ.30 లక్షల విలువైన 615 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని హైదరాబాద్కు చెందిన సివిల్ సప్లైతో పాటు టాస్క్ఫోర్స్ (Taskforce) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర కు రెండు లారీలు, ఒక మినీ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 615 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పక్కా సమాచారంతో చెన్నూర్ సమీపంలోని జాతీయ రహదారిపై పట్టుకున్నారు. పట్టుకున్న వాహనాలను చెన్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.