ఆదిలాబాద్ జిల్లాలో శరవేగంగా టీకా ప్రక్రియ
311 గ్రామాలు, 6 మున్సిపల్ వార్డుల్లో నూరు శాతం
త్వరలో మిగతా జీపీల్లో పూర్తి చేసేందుకు కసరత్తు
దగ్గరుండి టీకాలు వేయిస్తున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్
ఆదిలాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కట్టడికి యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు టీకా ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. 169 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఊరూరా పర్యటిస్తూ వ్యాక్సినేషన్ వేస్తున్నది. 468 గ్రామ పంచాయతీలకుగాను, 311 జీపీలలో.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 6 వార్డుల్లో వంద శాతం పూర్తి చేసింది. మరికొద్ది రోజుల్లో మిగతా గ్రామాల్లోనూ లక్ష్యాన్ని పూర్తి చేసే ధ్యేయంతో ముందుకెళ్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ కట్టడికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ 2 నుంచి 4 కేసుల వరకు నమోదవుతున్నాయి. నిత్యం అనుమానితులకు టెస్ట్లు చేయడం, 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ నిత్యం వైద్యశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కరోనా టీకా పంపిణీలో భాగంగా గ్రామ పంచాయతీలు, వార్డుల్లో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, పంచాయతీ, డీఆర్డీవో, అంగన్వాడీ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ టీకాకు అర్హులైన వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా మొబైల్ వాహనాల ద్వారా గ్రామాల్లో పర్యటిస్తూ టీకా వేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లాలో పర్యటించి కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, అర్హులందరికీ నిర్దేశిత గడువులోగా వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు.
311 గ్రామాల్లో వందశాతం..
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 468 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే 311 గ్రామాలు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 6 వార్డుల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. కలెక్టర్, వైద్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ దగ్గరుండి టీకా ఇప్పిస్తున్నారు. జిల్లాలో 169 వైద్య బృందాలను ఏర్పాటు చేసి గ్రామాలు, పట్టణాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రతి టీంలో నలుగురు సభ్యులరు ఉంటారు. వైద్య బృందాలు ఇంటింటా పర్యటిస్తూ 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వారి వివరాలను కొవిన్ యాప్లో నమోదు చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ దుకాణాలు, పంట పొలాల్లో ఉన్న వారికి సైతం వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రతలు తీసుకోవాలని మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీకాకు అర్హులైన వారు 5,48,098 మంది ఉండగా, 5,19,216 మందికి (95 శాతం) టీకా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 311 గ్రామాల్లో, ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6 వార్డుల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. కలెక్టర్, వైద్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ దగ్గరుండి టీకా ఇప్పిస్తున్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ త్వరలో టీకా పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రతలు తీసుకోవాలని మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరుతున్నారు. అర్హులైన వారందరూ టీకా తీసుకుని కొవిడ్ నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు.