ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్ పంటల సాగుకు అనుకూలంగా ప్రారంభమైంది. తొలుత వానల జాడ కానరాక రైతులు కొంత ఆందోళనకు గురవగా, తాజాగా పడుతున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నింపింది. ఇప్పటికే చేలల్లో వేసిన విత్తనాలు మొలకెత్తు తుండగా, మరికొన్ని చోట్ల సాగు పనుల్లో భాగంగా మందులు చల్లడం, గడ్డి పెరగకుండా చూడడంలో రైతాంగం నిమగ్నమైంది. ఈ సీజన్లో వర్షాలు అనుకూలిస్తాయని, దిగుబడి బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. అయితే జిల్లాలో 5.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నది.
ఆదిలాబాద్, జూలై 10 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.20 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది వానకాలం సీజన్లో 5.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో పత్తి 3.57 లక్షల ఎకరాలు, సోయాబీన్ 1.32 లక్ష ల ఎకరాలు, కంది 66 వేల ఎకరాలతో పాటు ఇత ర పంటలను రైతులు సాగు చేయనున్నారు. ఏటా రైతులు జూన్ మొదటి, రెండో వారంలో పత్తి విత్తనాలు వేస్తారు.
ఈ సీజన్లో 1.46 లక్షల మంది రై తులకు పంట పెట్టుబడి సాయం(రైతు బంధు) కింద రూ. 266 కోట్లను అందించడంతో పాటు రై తులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను ప్రభు త్వం పంపిణీ చేసింది. అన్నదాతలు అహర్నిశలు క ష్టపడి సాగు చేసిన పంటలు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోకుండా అధికారులు ముందస్తుగా విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా లో 65 శాతం మంది రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు. ఏటా జూన్ మొదటి వా రంలో విత్తనాలు వేస్తారు. ఈ సారి కొంతమంది రై తులు వానలు పడతాయనే ఆశతో విత్తనాలు వేయ గా, మరికొందరు వర్షాల కోసం ఎదురు చూశారు.
మొలకెత్తిన విత్తనాలు..
జిల్లాలో వానకాలం పంటల సాగులో భాగంగా రైతులు భూములను సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులు పంటలు వేయడానికి వర్షాల కోసం ఎదురు చూడగా, జూన్ మూడో వారంలో రెండ్రోజులు వానలు పడ్డాయి. దీంతో కొందరు రైతులు పత్తి, సోయాబీన్, కంది విత్తనాలు వేశారు. తర్వాత పది రోజులు వానలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వేసిన విత్తనాలు నష్టపోతామనే భయంతో పాటు పంటల సాగు ఆలస్యమవుతుందని ఆవేదన చెందారు.
ఈ సమయంలో వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పడుతున్న వర్షాలు రైతుల ఆశలను సజీవంగా ఉంచాయి. వేసిన విత్తనాలు మొలకెత్తాయి. క్రమంగా వానలు పడుతుండడంతో మొలకలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు పంటల సాగులో బిజీగా మారారు. కలుపు నివారణలో భాగంగా పత్తి, సోయాబీన్ పంటల్లో గడ్డి మందులను చల్లుతున్నారు. పత్తిలో డౌర కొడుతూ కలుపు తీసివేస్తున్నారు. సర్కారు అందిస్తున్న సాయంతో పంట పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా పోయిందని, వానలు కూడా అనుకూలిస్తుండడంతో వానకాలం పంటలు బాగా పండి, దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.