బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ముసురేయడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందగా.. పంటలకు ప్రాణం పోసినట్లయింది. వానకాలం మొదట్లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు రైతన్నలు విత్తనాలు విత్తారు. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో మొక్కలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. అన్నదాతలు మొగులు వైపు చూస్తుండగా.. వరుణుడు కరుణించాడు. చెరువుల్లోకి నీరు చేరుతుండగా.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీగా ఇన్ ఫ్లో రావడంతో గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదుతున్నారు. కాగా.. మంచిర్యాల, నిర్మల్ పట్టణాలను కారుమబ్బులు కమ్మేశాయి. పగలే చీకటిగా మారడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం చేశారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 3 : మంచిర్యాల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా ముసురు పడుతున్నది. సుమారు 25 రోజులుగా వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వాన వరంలా మారింది. పత్తి పంటలకు ప్రాణం పోసినట్లయింది. రెండో దఫా మందు వేసేందుకు రైతన్న సిద్ధమవుతున్నాడు. ఉక్కపోత, ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఊరటనిచ్చినట్లయింది. వాతావరణం చల్ల బడడంతో ఊపిరి పీల్చుకున్నారు. హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ శివారులోని ఆర్టీవో కార్యాలయం వద్ద 11 కేవీ విద్యుత్ వైరు తెగి మోటార్ సైకిల్పై పడింది. విద్యుత్ వైరు ట్రాన్స్ఫార్మర్ పక్కకు తెగిపోవడంతో రాహుల్, సాయి అనే స్నేహితులకు ప్రమాదం తప్పింది. కోటపల్లి మండలం నక్కలపల్లికి వెళ్లే దారిలోనున్న వాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. మంచిర్యాల పట్టణంలో కారుమబ్బులు కమ్ముకోగా.. మధ్యాహ్నమే చీకటి మయంగా మారింది. వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించారు.
9.5 మిల్లీ మీటర్ల వర్షం
జిల్లా వ్యాప్తంగా ఆదివారం 9.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జన్నారం మండలంలో అత్యధికంగా 46.4 మిల్లీ మీటర్ల వర్షం కురియగా, దండేపల్లిలో 15.7, లక్షెట్టిపేటలో 17.4, హాజీపూర్లో 0.9, కాసిపేటలో 22.5, తాండూరులో 2.1, భీమినిలో 2.6, కన్నెపల్లిలో 3.1, వేమనపల్లిలో 1.1, నెన్నెలలో 6.8, బెల్లంపల్లిలో 2.1, మందమర్రిలో 10.8, మంచిర్యాలలో 4.9, నస్పూర్లో 19.0, జైపూర్లో 13.1, భీమారంలో 2.8, చెన్నూర్ మండలంలో 0.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కోటపల్లి మండలంలో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఈ ఏడాది జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 790.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 754.0 మిల్లీ మీటర్లు నమోదైనట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోశాయి. వానకాలం ప్రారంభంలో కురిసిన చెదురుముదురు వానలకు రైతులు విత్తనాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో భారీగా వర్షాలు పడడంతో పంటలపై ఆశలు పెంచుకున్నారు. ఆపై వరుణుడు మొహం చాటేయడంతో ఆశలు సన్నగిల్లాయి. రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఈ వాన మేలు చేసింది. జిల్లాలో రైతులు ఎక్కువగా వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. పత్తి, సోయా, కంది పంటలకు వర్షాధారమే దిక్కు. వానలతో అక్కడక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. జూన్, జూలైలో ఇప్పటి వరకు 870.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 865.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
17.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు..
జిల్లా వ్యాప్తంగా సరాసరి 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెజ్జూర్లో 69.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జైనూర్లో 12.8, సిర్పూర్-యులో 31.8, లింగాపూర్లో 42.3, తిర్యాణిలో 5.2, రెబ్బెనలో 12.6, ఆసిఫాబాద్ 8.5, కెరమెరిలో 14.8, వాంకిడిలో 31.2, కాగజ్నగర్లో 12.2, సిర్పూర్-టీలో 9.1, కౌటాలలో 2.9, చింతలమానేపల్లిలో 3.3, పెంచికల్పేట్లో 2.8, దహెగాంలో 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో..
జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన కుమ్రం భీం, వట్టివాగు, చెలిమెల ప్రాజెక్టుల్లోకి వరద వస్తున్నది. కుమ్రం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు(10.393 టీఎంసీలు). 641 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, ప్రస్తుత నీటిమట్టం 237.700 మీటర్లు(5.809 టీఎంసీలు)కు చేరింది. దీంతో 5,6వ గేట్లు 0.5 మీటర్లకు ఎత్తి 2,076 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టులోకి 130 క్యూసెక్యుల ఇన్ఫ్లో వస్తుండగా, పంట కాలువల ద్వారా 130 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. తిర్యాణి మండలంలోని ఎన్టీఆర్ సాగర్ (చెలిమెల వాగు ప్రాజెక్టు)లోకి 20 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నుంచి 15 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల్లో..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఆదివారం కురిసిన వర్షం రైతులకు ఊరటనిచ్చింది. ఉట్నూర్లో రెండు రోజులుగా వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఏకధాటిగా గంటపాటు వాన పడింది. శివాజీ చౌక్, శాస్త్రీనగర్, శాంతినగన్ క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారిపై వర్షం నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. మిట్ట మధ్యాహ్నం చీకటిగా కమ్ముకోగా వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించారు. రోడ్లపై నిలిచిన నీటిని మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగింప చేశారు. ఖానాపూర్లోని సుభాష్నగర్, విద్యానగర్, పాత బస్టాండ్ మార్కెట్ ఏరియాలో రోడ్లపైకి వర్షపు నీరు రాగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఖానాపూర్-తర్లపాడు రహదారి మధ్యలో గాంధీనగర్ వద్ద రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ జేసీబీ సాయంతో తొలగించారు. దిలావర్పూర్లోని రెంకోని వాగు వంతెన పైనుంచి వరద పారింది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 700అడుగులు కాగా, ప్రస్తుతం 696.400 అడుగులు (6.696 టీఎంసీల) వద్ద ఉంది. కాగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉద యం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కడెం ప్రాజెక్టులోకి 41,245 క్యూసెక్కుల వరద వస్తుం డగా, అధికారులు 15, 17 నంబర్ల గేట్లు ఎత్తి గోదావరి లోకి 36,079 క్యూసెక్కులు వదులుతున్నారు. కడెం, బజార్హత్నూర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, నేరేడిగొండ, బోథ్, సిరికొండ, పెంబి, వర్షం పడింది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. పెంబి మండలంలోని కడెం, దొత్తి వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా, రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలా బాద్ జిల్లా తాంసి మండలంలోని మత్తడి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. 1200 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేటు ఎత్తి 1,568 క్యూసెక్కుల నీటిని వదిలారు.