మంచిర్యాల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అడవుల జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు(కేటీఆర్) రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి మంచిర్యాలకు చేరుకుంటారు. ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్, మంచిర్యాల అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించనున్నారు. మొదట జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం బెల్లంపల్లి చౌరస్తా, పోలీస్ స్టేషన్, అర్చన్ టెక్ చౌరస్తా, ముకారం చౌరస్తా, శ్రీనివాస థియేటర్, ఓవర్ బ్రిడ్జి, నస్పూర్లలో రోడ్షో నిర్వహించి ప్రసంగిస్తారు.
అనంతరం ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలంలో బస్టాండ్ పక్కనున్న గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. అనంతరం హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోతారు. చాలా రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ పర్యటించనుండగా, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు శ్రేణులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్షోలు, బహిరంగ సభలుంటాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి.. సత్తా చాటే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు.