మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడో రోజూ పట్టణ, పల్లె ప్రగతి
ప్రజాప్రతినిధులు, అధికారుల విస్తృత పర్యటన
వాడ వాడలా పారిశుధ్య పనులు
పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్లు
మంచిర్యాల, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆదివారం మూడో రోజూ కొనసాగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు ఊరూరా సందడి చేశారు. గ్రామస్తులతో కలిసి నడుస్తూ, సమస్యలు తెలుసుకుంటున్నారు. మురుగు కాలువలు శుభ్రం చేయిస్తున్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా ఊడ్పిస్తున్నారు. డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.
బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డులో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలోని 3,4,12 వార్డుల్లో ఎమ్మెల్యే దివాకర్రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణతో కలిసి పర్యటించారు. పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జైపూర్ మండలం వేలాల, శివ్వారం గ్రామాల్లో కలెక్టర్ భారతీహోళికేరి ఆకస్మికంగా సందర్శించారు. పల్లెప్రగతిలో భాగంగా నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మొక్క నాటుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రతి పల్లెలో సందడి నెలకొంది. వాండికి మండలం ఖమాన, జముల్ ధరి, ఖైరీట్, లంజన్వీర, వెల్గి, సర్కపల్లి, లక్ష్మిపూర్ గ్రామా ల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పర్యటించారు. వాడ వాడలా తిరుగుతూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిర్యాణి మండ లం గొల్లపల్లిలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కెరమెరి మండలం ఝరిలో జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) వరుణ్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీ తీశారు. ఆసిఫాబాద్ మండలం మోతుగూడలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్తో కలిసి ర్యాలీ తీశారు. బాబాపూర్ గ్రామంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేయవద్దని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఆసిఫాబాద్ పట్టణంలోని బెస్తవాడలో బోరింగ్ నీటిని పరిశీలిస్తున్న జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి