శ్రీరాంపూర్, డిసెంబర్ 27 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని హస్తం, కాషాయ పార్టీల్లో వర్గపోరు ముదిరి పాకాన పడుతున్నది. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జాతీయ కో ఆర్డినేటర్గా, తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియామకమై, నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మంగళవారం ర్యాలీగా వస్తున్న గోమాస శ్రీనివాస్ను శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద పీఎస్సార్ వర్గీయులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖకు సమాచారమివ్వకుండా పార్టీ జెండాలతో ర్యాలీ తీయడమేమిటని పలువురు నిలదీయగా, ఇరువర్గాల్లో వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ చేపట్టిన రైతు ధర్నాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులు మధ్య గొడవ జరగగా, శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నది.
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖకు సమాచారం లేకుండా పార్టీ జెండాలతో మంచిర్యాల నియోజక వర్గంలో గుమాస శ్రీనివాస్ ర్యాలీ నిర్వహించగా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద పీఎస్ఆర్ వర్గీయులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జాతీయ కోఆర్డినేటర్గా, తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియామకమై, నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మంచిర్యాలలోని తన నివాసానికి వస్తున్న శ్రీనివాస్కు ఆయా సంఘాలు స్వాగత ర్యాలీని ఏర్పాటు చేశాయి.
కొందరు అభిమానులు పార్టీ జెండాలతో పాటు, నేతకాని హక్కుల పోరాట సమితి అంబేద్కర్ పంచశీల జెండాలతో జైపూర్ ఇందారం గోదావరి బ్రిడ్జి నుంచి మంచిర్యాల వరకు బైక్ ర్యాలీ తీశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు వర్గీయులు శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద అడ్డుకొని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. శ్రీనివాస్తో పాటు జిల్లా నాయకుడు కేవీ ప్రతాప్ కూడా ఉన్నారు. వీరితో పార్టీ నస్పూర్ పట్టణాధ్యక్షుడు బండారి సుధాకర్, జిల్లా నాయకులు కొంతం రమేశ్, నస్పూర్ ఫ్లోర్ లీడర్ సుర్మిల్ల వేణు, కౌన్సిలర్లు రజిత, సుమతీ, కార్యకర్తలు గుమాస శ్రీనివాస్ ర్యాలీని అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోగా శ్రీరాంపూర్ సీఐ బీ రాజు, ఎస్ఐ మానస పోలీసులు నిరసనకారులను నివారించారు. అనంతరం ఇరువర్గాలు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పోలీసుల చర్చలతో గుమాస శ్రీనివాస్ ర్యాలీని విరమించుకొని మంచిర్యాలకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా నేతకాని హక్కుల పోరాట సమితి నాయకులు ఎల్లయ్య, నాగరాజు, రాజయ్య, బీసీ సంఘాల నాయకులు నీలకంఠేశ్వర్రావు మాట్లాడుతూ కుల సంఘం నేత ఉన్నత స్థానానికి వెళ్లిన సందర్భంగా దళిత, బీసీ, గిరిజనులు స్వాగత ర్యాలీ, సన్మాన సభ ఏర్పాటు చేసుకుంటే పీఎస్ఆర్ వర్గీయులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది దళితులను అవమాన పరిచినట్లేనని, ఇది అగ్రకులాల ఆధిపత్యానికి నిదర్శమని ఆరోపించారు.
ఆదిలాబాద్లో బీజేపీ రైతు ధర్నాలో..
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 27 : జిల్లాకేంద్రంలో బీజేపీ నాయకులు రైతు ధర్నా పేరిట మంగళవారం ధర్నా చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఇంటి నుంచి ర్యాలీ బయలు దేరింది. పాయల శంకర్, చిట్యాల సుహసిని రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డిలకు చెందిన అనుచరులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ చౌక్ వద్దకు చేరుకున్నది. అక్కడ పాయల శంకర్ స్పీచ్ ఇస్తుండగా బీజేపీకి చెందిన మరో వర్గ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులు వారి వాహనాల్లో ఉన్న డీజే సౌండ్ పెంచి పాటలు పెడుతూ పాయల శంకర్ ఉపన్యాసాన్ని వినకుండా చేశారు.
దీంతో కోపగించుకున్న పాయల శంకర్ అనుచరులు, కంది శ్రీనివాస్ రెడ్డి వాహనంలో ఉన్న డీజే బాక్సులతోపాటు వాహనాన్ని ధ్వంసం చేశారు. దీనిపై కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులు వీడియో ఫుటేజీలను పార్టీ అధిష్టానానికి పంపించి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మొత్తంగా తమకు రూ.2 లక్షల నష్టం జరిగినట్లు వారు పేర్కొన్నారు. ఇక తమ పార్టీలోనే ఈ రెండు వర్గాల గొడవ చూసి మరో వర్గ బీజేపీ నాయకులు ఏమనలో తెలియక మౌనంగా ఉండిపోయారు. కాగా మీలో మీరే కొట్టుకుంటున్నారు. ప్రజలకేం న్యాయం చేస్తారని ఆ ధర్నాకు వచ్చిన కొందరు వ్యాఖ్యానించుకోవడం వినిపించింది. మొత్తానికి బీజేపీ ధర్నా బెడిసి కొట్టి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.