కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్.. మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, దుర్గం చిన్నయ్య, దివాకర్రావులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, జాగృతి శ్రేణులు, ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుడిహత్నూర్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు రాస్తారోకో నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి.
చెన్నూర్, మందమర్రిలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు నల్ల జెండాలను పట్టుకుని నిరసన తెలిపారు. జైనూర్, తిర్యాణి మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించిన బడే భాయ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఛోటా భాయ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలు కలిసి కుట్రలు చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక పార్లమెంట్ ఎన్నికల ముందు ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. కేంద్ర దర్యాప్తుసంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలు బీజేపీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నాయని ఆరోపించారు. విచారణ పేరిట వచ్చిన అధికారులు కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలను కేంద్ర సంస్థలు ఎందుకు అరెస్ట్ చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
– మాజీ మంత్రి జోగు రామన్న
ఈడీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను మహిళా అని చూడకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. మోదీ పాలనలో దేశంలో మహిళలు ఏ మాత్రం గౌరవం లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అక్రమ అరెస్టులకు భయపడరని, కవిత నిర్దోషిగా బయటకొస్తారని తెలిపారు. ప్రతిపక్షాలపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు రాబోతున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని తెలిపారు.
– బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. దర్యాప్తు సంస్థలను తొత్తులుగా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఈ ఎత్తుగడలు వేస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ రాజకీయ కుట్రగానే భావిస్తున్నాం. కేసీఆర్ కుటుంబంపై కక్షసాధింపులకు పాల్పడితే బెదిరే ప్రసక్తి లేదు.
-కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
దేశంలోని బీజేపీ నిరంకుశ విధానానికి ఇది నిదర్శనం. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక రెండు జాతీయ పార్టీల కుట్ర ఉంది. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉండగా, ఇలా అదుపులోకి తీసుకోవడం సరికాదు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది. బీజేపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు.
– దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే(మంచిర్యాల)
ప్రతిపక్షపార్టీలను ఇబ్బంది పెట్టడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. బీజేపీలో చేరిన వారికి కేసులు మాఫీ చేస్తున్నది. రాష్ట్రం కోసం ఉద్యమించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయడమే పనిగా పెట్టుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ హేయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై కుటిల రాజకీయాలు చేస్తున్నాయి.
-దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే(బెల్లంపల్లి)