నార్నూర్, జనవరి 13 : ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఎంపికైన గ్రామాల్లో అవసరమైన పనులకే ప్రాధాన్యమివ్వాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి సర్పంచులకు సూచించారు. నార్నూర్ మండలం ఎంపల్లి పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, తండాను శుక్రవారం ఆయన సందర్శించారు. పీఎంఏవై ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, వివరాలు తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలను పీవోకు సర్పంచ్ గోవింద్నాయక్ వివరించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని పీవో సూచించారు. మలంగి, గుండాల, గుంజాల గ్రామాల్లో పనులను పరిశీలించాలని ఎంపీడీవో కావల రమేశ్ను ఆదేశించారు. ఎంపల్లి పంచాయతీలోని సమస్యలను పీవోకు వివరించగా, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈయన వెంట ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ జాదవ్ సచిన్, ఐటీడీఏ టెక్నికల్ అసిస్టెంట్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి అనురాగ్, గ్రామపెద్దలు తదితరులున్నారు.
మాన్కాపూర్లో పర్యటన..
మండలంలోని మాన్కాపూర్లో పీవో పర్యటించారు. సహకార సంఘం రైతులు, మహిళా సంఘాల సభ్యులతో పెరటి కోళ్ల పెంపకం, వ్యవసాయంపై చర్చించారు. సాగు కోసం ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేయాలని రైతులు కోరగా, సమీపంలోని చెక్డ్యాంను పీవో పరిశీలించారు. పెరటి కోళ్లు పెంచుతున్న మహిళలను అభినందించారు. ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. అలాగే రైతులు పాల ఉత్పత్తి చేసేందుకు ముందుకువస్తే ఆవులు, బర్రెలు అందించేందుకు ఐటీడీఏ ద్వారా సహకారం అందిస్తామన్నారు. ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారుల ద్వారా సర్వే చేసి, లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కృషిచేస్తామని తెలిపారు. రైతులకు సంబంధించిన నివేదికను రూపొందించి, ఐటీడీఏ కార్యాలయంలో సమర్పించాలని సీసీడీ ప్రాజెక్టు మేనేజర్ కుమ్ర విఠల్రావ్కు సూచించారు. పీవో వెంట మాజీ ఎంపీపీ మెస్రం రూప్దేవ్, ఉప సర్పంచ్ రాయిసిడాం రూప్దేవ్, మెస్రం బాధిరావ్, రైతులు మెస్రం యాదవ్రావ్, మెస్రం భీంరావ్, మహిళా సంఘం సభ్యులు కుమ్ర జంగుబాయి, ఆత్రం లక్ష్మీబాయి, కుమ్ర నిర్మలాబాయి తదితరులు ఉన్నారు.
ధర్మాజీపేట్ సందర్శన..
ఉట్నూర్ మండలం ధర్మాజీపేట్ గ్రామాన్ని పీవో సందర్శించారు. ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సోలార్ విద్యుత్ను పరిశీలించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్నగర్లో సీపీఎఫ్ ఎన్జీవో ద్వారా సాగు చేస్తున్న మామిడి, ఉసిరి తోటలను సందర్శించారు. తోటల పెంపకం, వర్మీ కంపోస్తు యూనిట్లను పరిశీలించారు. అలాగే టీఎఫ్ఎస్సీ సెంటర్ నిర్వహణ, వ్యవసాయ ఇన్ఫుట్ ఉపయోగాలు, విత్తన బ్యాంక్, విత్తన నిల్వలు, ఇంతర పంటల సాగు గురించి తెలుసుకున్నారు. సంస్థ కార్యక్రమాల ద్వారా రైతులు పొందిన లాభాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న కార్యకలాపాల గురించి సిబ్బందిని అడిగారు. ఆయన వెంట ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, అధికారలు, ఎన్జీవో సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.