ఎదులాపురం,జూన్6: బీజేపీని వ్యతిరేకించే వారికే తాము మద్దతు ఇస్తామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో మంగళ వారం ఆర్పీఐ ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు డోలు, గుస్సాడీ నృత్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం, నూతన సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యావాదలు తెలియజేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక హామీని బీజేపీ నెరవేర్చలేదన్నారు. అలాగే అధికారంలో వచ్చినప్పటి నుంచి మోదీ, అమిత్ షాలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన, పోరాటలు చేసిన వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వారు చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపుతామంటూ భయాందోళన గురి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీని ఓడించాలనే వారికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీని ఓడించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఫిరోజ్ హైమాద్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, సభ అధ్యక్షుడు సందీప్, దుర్వ నగేష్, యూనిస్ అక్బనీ, న్యాయవాది అజయ్, అల్లూరి భూమన్న, కేశవ్, మహిళ నాయకురాలు తుల్జపూరే శోభ, సర్పే సొంబాయి ఉన్నారు.
ప్రకాశ్ అంబేద్కర్ను కలిసిన ఎమ్మెల్యే
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కలిశారు. జిల్లాకు వచ్చిన ఆయనను టీటీడీసీ గెస్ట్ హౌస్లో కలిసి సత్కరించారు.