ఎదులాపురం : పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్రతో కలిసి అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల శాంతికి ప్రతీకగా కాగాడాలు వెలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరవీరుల కాలనీలోని సమస్యలను త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
ప్రజల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న పోలీసులు, సైనికులకు ఏమాత్రం తీసుపోరని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల నిబద్దత వెలకట్టలేనిదని గుర్తుచేశారు. ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ..విధి నిర్వహణలో అమరులైన పోలీసుల స్ఫూర్తి, ప్రేరణ పొందుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో విద్యార్థులు, పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్.శ్రీనివాసరావు, బి. వినోద్ కుమార్, టీఎస్పీఎస్ కమాండెంట్ వేణుగోపాల్ , డీఈవో ప్రణీత, డీఎస్పీలు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.