కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కొందరు భూ బకాసరులు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నరనడానికి ఇదే చక్కని ఉదాహరణ. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలాన్ని(గ్రామ కంఠం) ఆక్రమించేందుకు కొందరు కబ్జాదారులు యత్నించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొన్ని దశాబ్దాల క్రితం తేజాపూర్ గ్రామం ఏర్పడింది. సర్వే నంబరు.46లోని ప్రభుత్వ భూములను పేదలకు పంచగా, మిగిలిన సుమారు 3 ఎకరాలను గ్రామ అవసరాల కోసం వదిలేశారు.
ఈ స్థలంలో గ్రామస్తులు సామూహిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో కొందరు ఈ స్థలంపై కన్నేశారు. వారం క్రితం రాత్రికి రాత్రే ట్రాక్టర్లతో చదునుచేసి ప్లాట్లు చేశారు. ఈ విషయమై ఆగ్రహించిన గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వెనక్కితగ్గిన కబ్జాదారులు ప్లాట్లు చేసిన స్థలాన్ని మళ్లీ ట్రాక్టర్లతో దున్నించి ప్లాట్ల కోసం వేసిన గుర్తులను చెరిపేశారు. గ్రామస్తులు సంఘటితంగా ఎదరుతిరగడంతో భూ బకాసురులు వెనక్కితగ్గారు.
మా ముత్తాతల కాలంలో సర్వే నంబరు 46లో ఇండ్ల స్థలాలు ఇచ్చిన్రు. దాదాపు 3 ఎకరాలను గ్రామ అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో మేము దేవుని గుడిని కూడా కట్టుకున్నం. వారం కింద ఆసిఫాబాద్కు చెందిన కొంత మంది ఇక్కడ రాత్రికి రాత్రే ట్రాక్టర్లతో చదును చేసి ప్లాట్లు వేసిన్రు. గ్రామస్తులందరం కలిసి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేసినం. దీంతో భయపడి వెనక్కి తగ్గిన్రు.
– వడాయి బాపూరావు, తేజాపూర్ గ్రామ పటేల్