సిర్పూర్(టీ), అక్టోబర్ 25 : ‘నియోజకవర్గ ప్రజలే నా బలం.. నా బలగం.., ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా..’ అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని జీషాన్ గార్డెన్స్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అన్ని అంశాలను అమలు చేస్తుందన్నారు. మరోమారు సిర్పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని, ఎమ్మెల్యేగా మరో సారి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో వచ్చే దొంగలు, బాబాలను నమ్మవద్దని సూచించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, ఎంపీటీసీ సుహేల్ అహ్మద్ పార్టీలో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. అలాగే మండలకేంద్రానికి చెందిన దుర్గం అరవింద్ ఆధ్వర్యంలో యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు నామినేషన్ కోసం తమ వంతుగా రూ.1,116ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తుకారాం, చీలపల్లి సర్పంచ్ యాదగిరి బ్రహ్మయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు కీజర్హుస్సేన్, పార్టీ నాయకులు బొమ్మన శ్రీనివాస్, అజ్మేర మహేందర్ నాయక్, ప్రేంసాగర్ గౌడ్, తులసీరామ్, నజర్ అహ్మద్, చౌదరి నానాజీ, పిప్రె రాందాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.