ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక ( Physical ) , మానసిక ప్రశాంతత ( Mental Peace ) పొందవచ్చని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ( Collector Venkatesh Dotre ) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా, ధ్యానం ద్వారా శరీరాన్ని, మనసును ఏకం చేసి ఒత్తిడి, ఆందోళనలను తొలగిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా మార్చుకోవాలని, ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు.
విధి నిర్వహణలో ఉండే అధికారులు, ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి రోజు యోగాసనాలు ఆచరించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన యోగాపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి హాజరై యోగాసనాలు సాధన చేశారు. అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.