ఇచ్చోడ, ఫిబ్రవరి 23 : మండలంలోని జామిడి గ్రామపంచాయతీలో గురువారం కంటివెలుగు శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం 150 మందికి పరీక్షలు నిర్వహించారు. 37 మందికి కంటి అద్దాలు అందజేశారు. సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిత, వైద్య సిబ్బంది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’ గొప్ప కార్యక్రమం
ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే గొప్ప కార్యక్రమమని జైత రాం తండా సర్పంచ్ రేణుక-పరుశురాం అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామ ప్రజల సౌలభ్యం కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఈ నెల 27 వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు సందీప్, ఏఎన్ఎం మంగళ, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
196 మందికి కంటి పరీక్షలు
భీంపూర్, ఫిబ్రవరి 23 : మండలంలోని అర్లి(టీ) గ్రామంలో గురువారం 196 మందికి కంటి పరీక్షలు చేశారు. 27 మందికి కంటి అద్దాలు అందజేశారు. మరో 27 మందికి ప్రత్యేక అద్దాలు ఆర్డర్ చేశారు. 59 మందిని కంటి ఆపరేషన్ల కోసం గుర్తించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమ, డాక్టర్ అశ్విని, హెచ్ఈవో జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్, నఫీజ, సాజిద, భాగ్యవతి పాల్గొన్నారు.