ఆదిలాబాద్ రూరల్ : ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 49వ వార్డులో రూ.20 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు భారీగా పార్కులను అభివృద్ధి చేశామన్నారు.
ప్రజలు ప్రతిరోజూ వాకింగ్, వ్యాయామం చేయడానికి మున్సిపల్ స్థలాలున్న వార్డుల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం అరగంటపాటైనా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రకాశ్, నాయకులు ఇబ్బు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.