దిలావర్పూర్, మార్చి 19 : దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అని గాంధీజీ తెలిపిన మాటలను నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ గ్రామ ప్రగతికి బాటలు వేస్తున్నది. ఏటా ప్రతి పంచాయతీ లక్ష్యం నిర్దేశించుకొని ఆ లక్ష్యం ప్రకారం పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వందశాతం పూర్తి చేయాలి. ఇందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది కలిసి లక్ష్యం మేరకు కృషి చేయాల్సిందే. 2022-23 సంవత్సరానికి గాను దిలావర్పూర్ మండలంలో 12 గ్రామ పంచాయతీలకు గాను రూ.45,65,972 లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.
ఇంటి పన్ను చెల్లించేందుకు మందుకు వస్తున్న ప్రజలు
గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, గ్రామాల్లో పారిశుధ్యం సమస్య, డ్రైనేజీల్లో చెత్త లేకుండా చేసేందుకు పంచాయతీ కార్మికులను నియమించడం, ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం, విద్యుత్ దీపాలు వెలిగేలా చూస్తున్నది. దీంతో గ్రామస్తులు ఇంటి పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దిలావర్పూర్లో పంచాయతీ కార్యదర్శి, కారోబార్ కలిసి ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు.
వందం శాతం లక్ష్యం దిశగా దిలావర్పూర్…
దిలావర్పూర్ మండలంలో మొత్తం 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఏడు గ్రామ పంచాయతీలు శతశాతం ఇంటి పన్ను వసూలు చేసింది. మొత్తం లక్ష్యం రూ.45,65,972 కాగా నేటి వరకు రూ.38,38,088 ఇంటి పన్ను వసూలు చేశారు. బన్సపల్లి, గుండంపల్లి, కంజర్, మాడెగాం, మాయపూర్, సముందర్పల్లి, సాంగ్వి గ్రామాల్లో 100 శాతం వసూళ్లు పూర్తయ్యాయి. సిర్గాపూర్ 91, న్యూలోలం 74.23, కాల్వతండా 59.55, కాల్వ 92, దిలావర్పూర్ 59.51 శాతం వసూలయ్యాయి.
అందరి కృషితోనే సాధ్యం
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండల వ్యాప్తంగా ఏడు గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను శతశాతం చెల్లించారు. మొత్తం 80 శాతం ఇంటి పన్ను సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల కృషితో పూర్తి చేశాం. మిగతా పది రోజుల్లో మిగిలిన గ్రామాల్లో 100 శాతం పూర్తి చేస్తాం. దీనికి గ్రామంలోని ప్రజలు సహకరిస్తున్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజలు ఇంటి పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.
–అజీజ్ఖాన్, ఎంపీవో, దిలావర్పూర్
శతశాతం ఇంటి పన్ను పూర్తి చేశాం
గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి, ప్రభుత్వం ప్రతి నెలా నిధులు మంజూరు చేయడంతో సమస్యలు లేవు. గ్రామస్తులు సహకరించడంతో శతశాతం ఇంటి పన్ను పూర్తి చేశాం. పంచాయతీ కార్యదర్శి ప్రతి రోజూ ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తూ ఇంటి పన్ను వసూలు చేశాం.
–అకారపు గంగాలక్ష్మి, సర్పంచ్, సముందర్పల్లి