కోటపల్లి, ఆగస్టు 28 : నా పేరు రవీనా. మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం. మా తల్లిదండ్రులు కోట శంకరమ్మ-కిష్టయ్య. ఇద్దరు దివ్యాంగులే. సీఎం కేసీఆర్ సర్కారు ఇచ్చే పింఛనే జీవనాధారం. చిన్న చిన్నగా కూలీ పని చేస్తారు. నేను నిరుపేద కుటుంబంలో పుట్టినా.. రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల, కళాశాలలోనే ఉచితంగా చదివా. గతేడాది మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించా. చదువుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో నవంబర్ 5, 2022న ‘నమస్తే తెలంగాణ’లో ‘సాయమందించరూ..’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నా పైచదువులకు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. యాజమాన్యంతో మాట్లాడి నా మొదటి సంవత్సరం ఫీజు కట్టించి కళాశాలలో చేర్పించారు.
భవిష్యత్లోనూ నా వైద్య విద్యకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. నా అన్న వాళ్లే నా పైచదువులకు రూపాయి ఇవ్వని పరిస్థితిలో మా ఇంటికి పెద్ద దిక్కుగా సుమనన్న నిలిచారు. నేను ఈ రోజు వైద్య విద్య చదువుతున్నానంటే దానికి కారణం మా ఆయనే. మళ్లీ సుమనన్నకే చెన్నూర్ బీఆర్ఎస్ సీటు ఇచ్చారని విన్నా. గెలిచే, దమ్మున్న నాయకుడికి కేసీఆర్ సారు ఇచ్చారని భావిస్తున్నా. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న చెన్నూర్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నిలుపుతున్న నాయకుడు. నాలాంటి ఎంతో మంది చదువులకు అండగా ఉంటూ.. నిరుపేదల కష్టాలను తీర్చుతూ, అభివృద్ధే ప్రథమ అజెండాగా ముందుకు సాగుతున్న సుమనన్న రెండోసారి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో మొదటి ఓటును బాల్క సుమనన్నకే వేస్తానని శపథం చేస్తున్నా.