సిరికొండ, డిసెంబర్ 9 : గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని డివిజన్ పంచాయతీ అధికారి (డీఎల్పీవో) ధర్మరాణి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలోని పెండింగ్ పనులు ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో అతుల్ కుమార్, టీఏలు సుభాష్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎంపీవో స్వప్నశీల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, సమాకుర్చిన నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. వాటికి సంబంధించిన బిల్లులు అందేలా చూస్తామని తెలిపారు. మొక్కల పెంపకానికి నర్సరీలు సిద్ధం చేయాలని సూచించారు. వందశాతం పన్ను వసూలు చేయాలన్నారు.