అసిఫాబాద్, అక్టోబర్ 31 : రానున్న రోజుల్లో కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్లు అమ్ముకునేందుకు గాంధీ భవన్లో కౌంటర్లు పెట్టాలని పీసీసీ సభ్యుడు గణేశ్ రాథోడ్ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం డబ్బులకు అమ్ముడుపోయి ప్యారాచూట్కు టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఓడిపోయే వ్యక్తులకు సీట్లు కేటాయించారని మండిపడ్డారు. ఎన్నికలు ముగిశాక గాంధీ భవన్ను కిరాయికి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సూచించారు. 2019 నుంచి నియోజకవర్గంలోని కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ఎంతో కృషి చేశానని పేర్కొన్నారు. అవినీతిపరుడైన శ్యాం నాయక్ టికెట్ కేటాయించడంతో ప్రజలకు పార్టీపై నమ్మకం కోల్పోయిందన్నారు. ఒకో ఎంవీఐని రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో 10 మంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని, దీంతో శ్యాం నాయక్ పై ఏసీబీ కేసు నమోదయ్యిందని, ఉద్యోగం నుంచి తొలగిస్తారని భావించి ముందుగానే వీఆర్ఎస్ తీసుకొని ప్రజలకు సేవ చేస్తానంటూ కపట ప్రేమ చూపిస్తున్నాడని ఆరోపించారు.
ఖానాపూర్లో రేఖా శ్యాంనాయక్ దళిత బంధు, అభివృద్ధి పథకాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణతో ఆ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించలేదని విమర్శించారు. భార్యకు టికెట్ కేటాయించకపోవడంతో అదే రోజు శ్యాంనాయక్ కాంగ్రెస్లో చేరి నియోజకవర్గ టికెట్ కోసం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ఇన్చార్జి ఖర్గేకు డబ్బులు ఇచ్చాడని తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మేము ఏదో పిచ్చోడు మాట్లాడుతున్నాడులే అని అనుకున్నామన్నారు. శ్యాం నాయక్ రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సమీపంలో మూడెకరాల భూమి బినామీల పేరిట ఇచ్చాడని ఆరోపించారు. టికెట్ల డబ్బులు కమ్మి కార్యకర్తలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో అధిష్టానం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వకపోతే తమ కార్యచరణను రూపొందించుకొని నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉంటామని స్పష్టం చేశారు. శ్యాంనాయక్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో నాయకులు ఎండీ నిజాం, గడ్డల సత్తన్న, దుర్గం సోమయ్య, సత్తర్, మానిక్రావు, రాము, ఇస్మాయిల్, బాబుపటాన్, గోవింద్, ఆసీఫ్, తిరుపతి, ప్రశాంత్, సంతోష్, పోశాలు పాల్గొన్నారు.