సేవాభావం పెంపొందిస్తున్న ఆర్గనైజేషన్
వ్యాయామం, ఫైరింగ్తో పాటు ఇతర అంశాల్లో ట్రైనింగ్
రాటుదేలుతున్న కళాశాల యువత
ఆదిలాబాద్లో ఉత్సాహంగా శిబిరం
ఉమ్మడిజిల్లా నుంచి 450 మంది హాజరు
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 22:నేషనల్ కెడెట్ కార్ప్స్.. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొదిస్తూ, అనేక అంశాల్లో తీర్చిదిద్దుతున్నది. అవసరమైతే దేశ భద్రతకు ఉపయోగపడేలా యువతను సిద్ధం చేస్తున్నది. పాఠశాలలు, కళాశాలల్లోని పిల్లలు చదువుల్లోనే కాదు.. మిగతా అంశాల్లోనూ రాణించేలా తర్ఫీదునిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇటీవల ఉమ్మడి జిల్లా శిబిరం నిర్వహించగా, 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందిచేందుకు ఎన్సీసీ ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తున్నది. జిల్లాలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఎన్సీసీ గ్రూపులు నడుస్తున్నాయి. చిన్నతనం నుంచే దేశంపై అభిమానం, సేవాభావం, మంచి గుణాలు అలవర్చుకునేందుకు ఎన్సీసీ దోహదం చేస్తున్నది. అత్యవసర సమయంలో ఆర్మీ, నేవీ, ఎయిర్స్ఫోర్స్ల్లో చేరి అవసరమైన సేవలందించేందుకు కూడా యువతకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో డిసెంబర్ 1 నుంచి నాలుగు జిల్లాల వార్షిక శిక్షణాశిబిరాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 450 మంది కెడేట్లు శిక్షణలో పాల్గొనగా, ఇందులో 170 మంది బాలికలు ఉండడం విశేషం. గతేడాది కరోనాతో క్యాంప్ నిర్వహించలేక పోయినప్పటికీ ఈ ఏడాది కరోనా నిబంధనలు పాటిస్తూ కెడేట్లు శిక్షణ ఇస్తున్నారు. బీ సర్టిఫికెట్ కోసం అవసరమైన అన్ని రకాల శిక్షణను కెడెట్లకు అందిస్తున్నట్లు గ్రూప్ కమాండర్ హెచ్ఎస్ఎస్ కృష్ణ కుమార్ తెలిపారు.
శిక్షణ ఇలా..
ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచే శిక్షణ ప్రారంభమవుతుంది. ముందుగా వ్యాయామం చేయిస్తారు. అనంతరం పరేడ్లో మెళకువలు నేర్పిస్తారు. మ్యాప్రీడింగ్, అడవుల్లో ఎలా ఉండాలి.. సిగ్నల్స్, ఫైరింగ్, ఆప్టికల్ ట్రైనింగ్, టెంట్స్, మ్యాపింగ్లాంటి అనేక అంశాల్లో ప్రతి రోజూ ఫీల్డ్లో శిక్షణ ఇస్తారు. దీంతో పాటు ప్రతిరోజు విద్యార్థులకు ఎన్సీసీ అధికారులు థియరీ క్లాస్లు నిర్వహిస్తుంటారు. విద్యార్థులు సమాజంలో ఎలా మసులుకోవాలి, ఆపద సమయంలో ఎలా ఉండాలి, సమాజంలో తిరిగే అరాచక శక్తులను గుర్తించి పోలీసులకు ఎలా సహకరించాలి అనే విషయాలపై క్షుణ్ణంగా శిక్షణలో నేర్పిస్తారు. ఆపద సమయంలో దేశానికి ఎలా ఉపయోగపడాలి, అవసరమైతే నేరుగా ఆర్మీలోకి తీసుకోవడానికి అవసరమైన అన్ని రకాల శిక్షణలను వీరికి అందిస్తున్నారు. ఎన్సీసీలో బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
నిబంధనలు పాటిస్తూ శిక్షణ అందిస్తున్నాం..
రెండేళ్లుగా కరోనాతో ఎలాంటి క్యాంప్లు నిర్వహించలేక పోతున్నాం. ఈ ఏడాది క్యాంప్ నిర్వహించే అవకాశం ఉండడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ బీ సర్టిఫికెట్ కోసం కళాశాల కెడెట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహి స్తున్నాం. శిక్షణలో ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, పరేడ్లను నేర్పిస్తుం. ఆర్మీలో మంచి శిక్షణ పొందిన ఆఫీసర్లు కెడేట్లకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు శారీరక శిక్షణతో పాటు దేశభక్తి, క్రమశిక్షణలాంటి అనేక విషయాలపై ట్రైనింగ్ ఇస్తున్నాం. – హెచ్ఎస్ఎస్ క్రిష్ణ కుమార్, గ్రూప్ కమాండర్
చెడును ఎదురించే ధైర్యం కోసమే..
చెడును ఎదురించే ధైర్యం ఎన్సీసీతో వస్తుంది. సమాజంలో ధైర్యంగా ఉండగలుగుతాం. తప్పులు చేసిన వారిని ఎదురించే అవకాశం వస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు ఎన్సీసీ అంటే ఇష్టం. ఆ యూనిఫాం వేసుకొని పేదలకు సేవ చేయాలనేది నా ఆలోచన. క్రమశిక్షణ, సేవాగుణం ఉన్నవాళ్లకు ఎన్సీసీ ఒక చక్కని అవకాశం. దేశం కోసం ముందుండేలా ఇక్కడ అనేక అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
నాయకత్వ లక్షణాలు అలవడుతాయి..
ఎన్సీసీలో చేరితే జీవితంలో కచ్చితమైన క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతాయి. ఆర్మీ, నేవీల్లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు అలవడి నలుగురితో కలిసిపోయే తత్వం పెరుగుతుంది. ఎలాంటి రంగంలోనైనా ధైర్యంగా రాణించే అవకాశం దక్కుతుంది. ఎన్సీసీలో ఇష్టంతో చేరితే ఏదీ కష్టమనిపించదు. పరేడ్, ఫైరింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు.
-బీ ప్రియాంక, ఆదిలాబాద్