ఇచ్చోడ(సిరికొండ), జూన్ 23 : రాష్ట్ర ప్రభుత్వం సమయానికి జొన్నలు కొనుగోలు చేసి లోడింగ్ చేయకపోవడంతోనే మనస్తానికి గురై తన తమ్ముడు నుగురే పాండురంగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత రైతు అన్న నుగురే నారాయణ ఆరోపించారు. మంగళవారం సిరికొండ మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకు లు, నుగురే నారాయణ మాట్లాడారు. పొన్న గ్రామానికి చెందిన పేద రైతు పంట కొనుగోలు చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. బాధిత కుటుంబాన్ని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారన్నారు. కానీ.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, కాంగ్రెస్ నాయకులు విమర్శించడం తగదన్నారు.
ఇంత వరకు కాంగ్రెస్ ఏ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. దమ్ముంటే రైతు కుటుంబానికి రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు స్పందించి తక్షణమే రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారని గుర్తు చేశారు. రైతు ఆత్మహత్య చేసుకున్న కారణాలను వెతకాల్సింది పోయి ప్రతిపక్షాలపై విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చాతనైతే రైతుల బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ పెంటన్న, బీఆర్ఎస్ నాయకులు చౌహన్ సూర్యకాంత్, రోహిదాస్, రాజారాం, సునీల్, సూర్యకాంత్, రంజాన్, చందు, భీంరావు పటేల్, నర్సయ్య పాల్గొన్నారు.