పదమూడో రోజూ పల్లె, పట్టణ ప్రగతి
ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలు
పనుల పరిశీలన.. సమస్యల పరిష్కారం..
ఆదిలాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం పద మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మావల మండలం బట్టి సవర్గాం, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామాల్లో పర్యటించారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పట్టణంలో పలు కాలనీల్లో పర్యటించారు. నిర్మల్ జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజేందర్ మున్సిపాలిటీ పరిధిలో పలు గ్రామాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు పరిశుభ్రంగా మారడంతో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట పడినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా స్థానికులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరినట్లు తెలిపారు. గ్రామంలోని మురికికాలువలు, రహదారులు, పల్లె ప్రకృతి వనాలను ఎమ్మెల్యేలు సందర్శించారు.
మావల మండలం బట్టిసవర్గాంలో స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న
మావల మండలం బట్టిసవర్గాం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే