నిర్మల్ జిల్లాలో అద్దె కార్యాలయాలకు చెల్లుచీటి
హైటెక్ హంగులతో తీర్చిదిద్దుతున్న సర్కారు
నూతన ఆఫీసుల్లో వైఫై, సీసీ కెమెరాలు
పారదర్శకంగా పనులు జరిగేందుకు చర్యలు
టాయిలెట్, మంచినీరు వంటి వసతులతో ఏర్పాట్లు
నిర్మల్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాలుగా ప్రైవేట్ భవనాల్లో మగ్గుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు కాలం చెల్లింది. అరకొర సౌకర్యాలతో నెట్టుకొస్తున్న అధికారులు, సిబ్బంది బాధలను చూసిన సర్కారు పక్కా భవనాలు నిర్మిస్తున్నది. నిర్మల్ జిల్లాలో ఈ ఏడేండ్ల కాలంలో దాదాపు రూ.200 కోట్లకుపైగా వెచ్చించి సొంత భవనాల నిర్మాణం చేపడుతున్నది. ఇందులో కొన్ని పూర్తికాగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నూతన కార్యాలయాలను హైటెక్ హంగులతో నిర్మిస్తుండగా.. వైఫై, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. టాయిలెట్స్, మంచినీటి వసతి కల్పిస్తుండగా.. పనులు పారదర్శకంగా జరగడానికి ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల బాధలు తీరుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాల కాలం నుంచి అద్దె భవనాల్లో కొనసాగుతున్న సర్కారు ఆఫీసులు క్రమంగా సొంత భవనాల్లోకి అడుగుపెడుతున్నాయి. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్.. మొదటి నుం చే అన్ని ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలు ఉండాల్సిందేనని నిర్ణయించింది. ప్రతినెలా ఈ అద్దె భవనాలకు లక్షల రూపాయలు కిరాయిలు చెల్లిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అందలేదు. ఇటు కార్యాలయాల్లో పని చేసే అధికారులు, సిబ్బందికి, కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చే జనాలకు సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్ని శాఖలకు సొంత భవనాల నిర్మాణాలు ఇప్పటికే మొదలయ్యాయి.
శరవేగంగా పనులు..
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, పంట ఉత్పత్తుల నిల్వకు గోదాంల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. దాదాపు రూ.200 కోట్లతో ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో సొంత భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. స్థానిక ఎల్లపెల్లి శివారులో రూ.41 కోట్ల వ్యయంతో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు కొద్ది రోజుల్లోనే పూర్తి కానున్నాయి. కలెక్టరేట్ నిర్మాణం కోసం దాదాపు 20 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. కలెక్టరేట్కు సమీపంలోని మరో 15 ఎకరాల్లో జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా నిర్మించబోతున్నారు. రూ.32కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులకు ఇటీవలే మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే చించోలి(బీ) సమీపంలో రూ.3.50 కోట్లతో రవాణా శాఖ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో రూ.35లక్షలతో ప్రాంతీయ పశువుల దవాఖాన భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీంతో పాటు భీమన్న గుట్ట ప్రాంతంలో రూ. 50కోట్లతో జిల్లా వైద్యశాల పనులను చేపట్టబోతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంచేందుకు రూ.4.50 కోట్లతో అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు. దీంతో పాటు చించోలి(బీ) గ్రామం వద్ద దాదాపు రూ.100 కోట్లతో భారీ ఎత్తున మైనార్టీ విద్యాసంస్థల భవనాలను నిర్మించారు. ఇక్కడ వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుకోవడంతో పాటు వసతి ఏర్పాట్లకు అవసరమైన భవనాలను నిర్మించారు.
జిల్లాలోని కేజీబీవీ భవనాల నిర్మాణాలకు రూ.18 కోట్లను వ్యయం చేస్తున్నారు. ఒక్కో భవనానికి రూ. 3 కోట్లకు పైగా మంజూరయ్యాయి. నిర్మల్ పట్టణ శివారులోని సోఫీనగర్, లక్ష్మణచాంద, కడెం మండలాల్లో ఇప్పటికే ఈ భవనాల నిర్మాణం పూర్తి కాగా, అనంతపేట్, సోన్, పెంబి తదితర గ్రామాల్లో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే మరో రూ.23 కోట్లతో లక్ష్మణాచాంద మండలంలోని బోరిగాం వద్ద భారీ గోదాంలను నిర్మిస్తున్నారు. మామడ వద్ద కూడా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన గోదాంల నిర్మాణం కోసం ప్రతిపాదనలను పంపించారు. ఇప్పటికే నిర్మల్లో ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలను రూ.6 కోట్లతో నిర్మించారు. వీటితో పాటు ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖల పరిధిలో మరికొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయ భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలను రూపొందించినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలుపుతున్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.6 కోటతో అంచనాలు రూపొందించారు. బస్టాండ్కు సమీపంలో రూ.100 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు. రిజిస్ర్టేషన్శాఖ కార్యాలయం, వాణిజ్య పనుల శాఖ కార్యాలయానికి ఇప్పటికే స్థలాలు కేటాయించగా, భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించారు.
అద్దె భవనాలకు కాలం చెల్లు..
ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగిన ప్రభుత్వ కార్యాలయాలకు ఇక కాలం చెల్లినట్లే. ఇంత కాలం అరకొర సౌకర్యాలతో కొనసాగిన ఈ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇకపై సొంత కార్యాలయ భవనాల్లో అన్ని సదుపాయాల మధ్య సిబ్బంది పని చేయనున్నారు. నూతనంగా నిర్మించే కార్యాలయాల్లో హైటెక్ సొబగులతో తీర్చి దిద్దనున్నారు. ముఖ్యంగా ప్రతి కార్యాలయంలో వైఫై, ఇంటర్నెట్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పకడ్బందీగా ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పనులు పారదర్శకంగా జరుగనున్నాయి. అన్ని కార్యాలయాల్లో సిబ్బందికి, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు టాయిలెట్లు, తాగునీరు తదితర సదుపాయాలను కొత్త భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు.