కుమ్రం భీంఆసిఫాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : మండలంలోని మార్లవాయికి చెందిన పద్మశ్రీ కనకరాజు బృందం (10 మంది సభ్యులు) దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నది. ఎర్రకోటలో గుస్సాడీ నృత్యాలతో హోరెత్తనించనున్నది. గతేడాది నవంబర్ 27న హైదరాబాద్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన పోటీల్లో పద్మశ్రీ కనకరాజు బృందం ప్రతిభ కనబరిచి జోన్ స్థాయి పోటీలకు ఎంపికైంది. డిసెంబర్ 6న నాగ్పూర్లోని సౌత్జోన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన పోటీల్లోనూ పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రాండ్ ఫైనల్ పోటీలకు ఎంపికైంది. 20వ తేదీన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గ్రాం డ్ ఫైనల్ పోటీలు నిర్వహించగా, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన బృందాలు ప్రదర్శనలు ఇచ్చా యి. ఇందులో సత్తా చాటిన కనకరాజు బృందా న్ని గణతంత్ర వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలకోసం ఎంపిక చేశారు. ఈ మేరకు ఈ బృందం ఈ నెల 6న ఢిల్లీకి బయలుదేరి వెళ్లగా, అక్కడే ఉండి రిహార్సల్ చేసింది.
ఢిల్లీలోనే ఉండి రిహార్సల్ చేస్తం
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శనివ్వనున్నం. 20 రోజుల పాటు ఇక్కడే ఉండి రిహార్సల్ చేశాం. దేశ రాజధానిలో గుస్సాడీ, దండారీ నృత్యాలు చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా భావిస్తున్నాం. ప్రదర్శనలకు పోయినప్పుడు వేదికపైకి చేరగానే కొంత భయమేసింది. కానీ ఆ తర్వాత బృందం సభ్యులతో కలిసి నృత్యం చేస్తుంటే ఉత్సాహమనిపించింది.
-ఏ దెవురావు, బృందం సభ్యుడు
కనకరాజుకు రుణపడి ఉంటం
మా గూడేల్లో నిత్యం దండారీ నృత్యాలు చేస్తుంటం. మొదటిసారి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నందుకు మొదట భయమేసింది. ఆ తర్వాత అందరితో కలిసి నృత్యం చేయడం ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో గెలిచి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపికయ్యాం. అప్పుడు చాలా సంతోష పడ్డాం. మా వెన్నంటి నడిపించిన పద్మశ్రీ కనక రాజుకు రుణపడి ఉంటం.
– కే మారు, బృందం సభ్యుడు
మా జాతికే గౌరవం
కనకరాజు ఎంతో మందికి గుస్సాడీ నృత్యం నేర్పారు. జాతీయ స్థాయిలో ప్రదర్శనల ఇచ్చి మా సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా జాతికే గౌరవం. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటం.
– ఎస్ కృష్ణ, బృందం సభ్యుడు
ఇది మాకు మంచి వేదిక
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గెలిచి ఇక్కడి దాకా వచ్చాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మా ప్రదర్శనలు ఇస్తాం. కష్టపడి రిహార్సల్ చేశాం. దేశ రాజధాని ఢిల్లీలో ఆట పాటలతో హోరెత్తిస్తాం. ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసేందుకు ఇది మాకు మంచి వేదిక అనుకుంటున్నాం. కలిసికట్టుగా ప్రదర్శన ఇచ్చి మా సత్తా చాటుతాం.
-భీంరావు, బృందం సభ్యుడు
గర్వంగా ఉంది
రాష్ట్ర, సౌత్జోన్, జాతీయ స్థాయిలో ప్రదర్శనలిచ్చాం. అన్ని చోట్ల ఎంపికయ్యాం. ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఫైనల్లోనూ విజేతగా నిలిచిచాం. ఇందుకు గర్వంగా ఉంది. దేశ రాజధానిలో జరిగే గణతంత్ర వేడుకల్లో మా సత్తాచాటుతాం. దేశవ్యాప్తంగా ఆదివాసీ సంస్కృతిని పరిచయం చేస్తాం. అందరి మెప్పును పొంది తీరుతం.
-కనక సుదర్శన్, టీం లీడర్
ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేస్తా
ఆదివాసీ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా కృషి చేస్తా. గుస్సాడీ నృత్యానికి ఇప్పటికే నాకు దేశ అత్యుత్తమ అవార్డు దక్కింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు మా బృందం ఎంపికైనందుకు గౌరవంగా భావిస్తున్నాం. అక్కడ ప్రతిభ కనబరిచి మంచి గుర్తింపు తెచ్చుకుంటాం.
– పద్మశ్రీ కనక రాజు