హాజీపూర్, నవబంర్ 17 : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలో 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పొలాలన్నీ నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోతుండగా, రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటీవల మొంథా తుపాన్ వల్ల కురిసిన వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. ఆ సమయంలో అధికారులు నీటిని విడుదల చేయగా, 42 మత్తడికి గండి పడింది. అప్పటి నుంచి కడెం 42 ప్రధాన కాల్వ నుంచి వచ్చే నీరం తా పెద్దంపేట శివారులోని సుమారు 150 ఎకరాల్లోని వరి, పత్తి పంటల్లోకి చేరింది.
కొలాంగూడ నుంచి దారి ఉన్నప్పటికీ.. పెద్దంపేట గ్రామ శివారులోని వాగును దాటుకొని పొలాల్లోకి వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు, ఎడ్లబండ్లవంటివి వచ్చే వీలు లేకుండా పోయింది. కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కడెం కాల్వ 42డీ-కి ఉన్న షటర్స్ను తెరిచి నీటిని కిందికి వదిలితే పంట నష్టం జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. కడెం ప్రాజెక్టు గేటుకు కర్ర మొద్దు అడ్డుపడిందని, దానిని తీసేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నం చేస్తున్నామని, కర్ర మొద్దు బయటకు వస్తే గేటును దింపి నీటిని నిలుపుదల చేస్తామన్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
పూర్వ కడెం కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకూ సాగునీరందించేవారు. 42వ ప్రధాన కాల్వ ద్వారా పొలాలకు నీరు చేరేది. కానీ, ఇటీవల కురిసిన వర్షాలకు 42వ ప్రధాన కాల్వపైన ఉన్న మత్తడికి గండి పడింది. ఇంద్ర జల ప్రభ పథకంలో నిర్మించిన కుంట నిండిపోయి పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. వరి పొలాలు కోయలేని పరిస్థితి వచ్చింది. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వమే మమ్ముల ఆదుకోవాలి.
– బెబండి గురువయ్య, రైతు