నేరడిగొండ : తెలంగాణలోని ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం నేరడిగొండలో టీఆర్ఎస్ మండల కమిటీ ఎన్నికను గ్రామ కమిటీల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రతి పక్షాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితులో లేరన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.
పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల కమిటీ ఎన్నికను గ్రామ కమిటీల సమక్షంలో నిర్వహించారు. మండల కన్వీనర్గా అల్లూరి శివారెడ్డితో పాటు మండల కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, నేరడిగొండ సర్పంచ్ పెంట వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, నాయకులు సయ్యద్ జహీర్, గడ్డం భీంరెడ్డి, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, చంద్రశేఖర్యాదవ్, ఆడెపు రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.