ఎదులాపురం, డిసెంబర్ 30 : జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ -8 ప్రారంభమవుతుందని అదనపు ఎస్పీ ఎస్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక హెడ్క్వార్టర్లో ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆపరేషన్ స్మైల్ -8కు సంబంధించి గురువారం కోఆర్టినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. బాలలతో పనులు చేస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాల కార్మికులకు విముక్తి కల్పించేలా ఆపరేషన్ స్మైల్ బృందాలు పని చేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సబ్ డివిజన్ల పరిధిలో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ రెండు టీంలలో బాలల సంరక్షణ విభాగం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, లేబర్, సీడబ్ల్యూసీ అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. డీసీపీవో రాజేంద్రప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, లేబర్ అధికారి జీ వినోద్, డీసీఆర్బీ సీఐ గుణవంతరావు, ఎస్ఐలు అంజమ్మ, దేవ్రావు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.