ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. రెండు రోజులుగా విద్యాశాఖ అధికారులు డీఈవో కార్యాలయంలో స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్లలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ), హెచ్ఎంలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల ధ్రువపత్రాలు, సర్వీసు పుస్తకాలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 27 నుంచి టీచర్ల ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. విద్యాశాఖ అధికారులు సీనియారిటీ జాబితాను తయారు చేస్తున్నారు.
– ఆదిలాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జనవరి 25 ( నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాల్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడంతో పాటు ప్రమోషన్లు కల్పించడానికి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ 37 రోజులు పాటు కొనసాగుతుంది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుండగా ఆ రోజు ఖాళీలు, ప్రమోషన్ల సీనియారిటీ జాబితాను వెల్లడిస్తారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 28 నుంచి మూడ్రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3 వరకు అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 14న ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉద్యోగోన్నతులు, ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు, ఫిబ్రవరి 22, 23 తేదీల్లో బదిలీలు, 25 నుంచి 27 వరకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పిస్తారు. మార్చి 4న ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. మార్చి 5 నుంచి 19 వరకు బదిలీల ప్రక్రియలో భాగంగా ఏదైనా పొరపాట్లు జరిగితే సవరించేందుకు చర్యలు తీసుకుంటారు.
ప్రభుత్వ, లోకల్ బాడీ, యాజమాన్య పరిధిలోని తెలుగు, హింది, ఉర్దూ, మరాఠి మీడియం వారీగా మొత్తం 36 కేటగిరీల్లో ఖాళీలను 1998 డీఎస్సీ నుంచి 2017 టీఆర్టీ వరకు ఉపాధ్యాయులు ఈ ప్రక్రియలో హాజరుకావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ధ్రువపత్రాలు, సర్వీసు పుస్తకాల పరిశీలనకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రమోషన్ల విషయంలో సీనియారిటీ జాబితా కీలకం కానుండగా ఒక్కో పోస్టుకు 1ః3 ప్రాతిపాదికన ఉపాధ్యాయుల ధ్రువపత్రాలను పరిశీస్తున్నారు. జిల్లాలో సబ్జెక్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తున్నారు. జనవరి 17 వరకు మల్టీజోన్ పరిధిలోకి వచ్చే 48 పీజీహెచ్ఎంలతో పాటు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎంలు మొత్తం 256 ఖాళీలు ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సందడి నెలకొంది.