కాసిపేట, నవంబర్ 17 : ‘సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ, తెలంగాణ ఏర్పాటై, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాలు కల్పించి, సింగరేణిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే..’ అని చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. మందమర్రి ఏరియా కాసిపేట గని ఆవరణలో శుక్రవారం టీబీజీకేఎస్ కార్యదర్శి వొడ్నాల రాజన్న అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాక ముందు సింగరేణి ఎలా ఉండేదో కార్మికులు ఆలోచించాలని కోరారు. సింగరేణి సంస్థ అభివృద్ధి ఆయనతోనే సాధ్యమైందన్నారు. గతంలో వారసత్వ ఉద్యోగాలు పోగొడితే, సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కారుణ్య నియామకాలు చేపట్టి సింగరేణి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు గుర్తుచేశారు.
సింగరేణిని గ్లోబల్ ఆర్గనైజేషన్ చేయాలని, భవిష్యత్లో అత్యధికంగా కార్మికుల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్కు విజన్ ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సింగరేణిని 49 శాతం కేంద్రానికి అప్పనంగా అప్పగించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. గడ్డం వెంకటస్వామి కుటుంబ హయాంలోనే సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్రానికి వాటాను కట్టబెట్టారని ఆరోపించారు. అప్పుడు నష్టం చేసి, ఇప్పుడు ప్రేమ వొలకబోస్తూ డబ్బులను ఎర చూపిస్తూ గడ్డం బ్రదర్స్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో బొగ్గు బావులను వేలం పెడితే సింగరేణికే ఇవ్వాలని లొల్లి చేశామని గుర్తుచేశారు. వినోద్, వివేక్ సింగరేణి కార్మికుల కోసం ఏ రోజూ మాట్లాడిన పాపాన పోలేదన్నారు. రేవంత్ రెడ్డికి వంద కోట్లు ఇచ్చి, బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున చెన్నూర్ టికెట్ తెచ్చుకున్నాడని విమర్శించారు. స్వార్థ రాజకీయాలు తప్ప వివేక్, వినోద్ ప్రజలకు చేసిందేమి లేదని ఆరోపించారు. కార్మికుల కోసం పని చేసింది గులాబీ జెండా మాత్రమేననన్నారు.
తాము కార్మికుల కోసం, సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పని చేస్తుంటే వాళ్లు స్వార్థ రాజకీయాల కోసం అంగీలను మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు. వేరే రాష్ర్టాల్లో పరిశ్రమలు పెట్టి, అక్కడి వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, కానీ, ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అలాంటి వారికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎందుకు అవకాశం ఇస్తారన్నారు. వంద కోట్లు పెట్టి గెలిస్తే, వెయ్యికోట్లు ఎలా సంపాధించాలనే చూస్తారని, ప్రజలకు సేవ చేయరని వివరించారు. కార్మికులకు ట్యాక్స్, రీయింబర్స్మెంట్ చేయించాలని సీఎం కేసీఆర్ను కోరడంతో పని చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్మికులు ఉంటున్న క్వార్టర్లు విరమణ పొందిన తర్వాత కూడా వారికి ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. సింగరేణిలో అనేక సంక్షేమ పథకాలు కార్మికులకు ఇచ్చామన్నారు. ప్రజల కోసం పని చేస్తున్నామని, వాళ్లు వారి స్వార్థం కోసం పని చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉన్నదని, అతి తక్కువ సమయంలో రాష్ట్రం ముందుండేందుకు కారణం, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకత్వమేనని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే భద్రంగా, ప్రగతి పథంలో ఉంటుందన్నారు. ఓటును జాగ్రత్తగా ఆగం కాకుండా, ప్రలోభాలకు లొంగకుండా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాసిపేట గనిలో 500 మందిని తీసేసే పరిస్థితి ఉంటే కాసిపేట 1ఏ విస్తరణ చేయించి, ఇక్కడే కార్మికులను ఉంచామని గుర్తుచేశారు. ఓటర్లను డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని, నిస్వార్థంగా సేవ చేసే నాయకులు కావాలా..? లేక కేవలం ఎన్నికలకు నెల ముందు డబ్బుల సంచులు పట్టుకొని వచ్చేవాళ్లు కావాలా..? అని కార్మికులను అడుగగా.. జై బీఆర్ఎస్ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. చెన్నూర్, బెల్లంపల్లిలో ఎమ్మెల్యేలుగా బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య గెలిపించుకుంటామని నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు.
డబ్బుతో రాజకీయం చేసే గడ్డం బ్రదర్స్ను ప్రజలు చిత్తుగా ఓడించాలని బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కార్మికులను కోరారు. కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ తెలుసునని, కార్మికులు అందరికీ వివరించాలన్నారు. కాంగ్రెస్ హ యాం లో గడ్డం వెంకటస్వామి వారి కుటుంబం ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. ఊసరవెల్లి మాదిరి పార్టీలు మారుస్తూ డబ్బు సంచులతో వ చ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, అలాంటి వారిని వ్యతిరేకించాలని, వారిని చిత్తుగా ఓడించి పాతాల లోకంలో పాతి పెట్టాలని కార్మికులను కోరారు.
పోరాట గడ్డ సింగరేణి ప్రాంతంలో వినోద్, వివేక్కు బుద్ధి చెప్పాలన్నారు. తాము చేసిన పనులు, సేవలను గుర్తించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, అందుగుల శ్రీనివాస్, బడికల సంపత్, వో రాజశేఖర్, ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న, పవన్, రెడ్డి, పిట్ కార్యదర్శులు కారుకూరి తిరుపతి, బైరి శంకర్, వైస్ ఎంపీపీ విక్రంరావు, సర్పంచ్ ప్రమీలాగౌడ్, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బన్న లక్ష్మణ్దాస్, కనుకుల తిరుపతి, జాడి శివ, దుగుట శ్రీనివాస్, బెల్లం అశోక్, పుప్పాల శ్రీనివాస్, బొమ్మ సాహిత్ రెడ్డి, సతీశ్ యాదవ్, ఈట రాకేశ్, భువన చంద్ర, రామునూరి రాజేశ్, మంత్రి మహేశ్, సోంశెట్టి నరేశ్, అందె శ్రీకాంత్, రంజిత్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.