కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. కొందరు వ్యాపారులు అధికారుల కళ్లుగప్పి వివిధ మార్గాల్లో మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు డీలర్లు రేషన్ బియ్యం కోసం వచ్చిన వారి వద్దే తిరిగి కొని.. వ్యాపారం చేస్తుండగా, మరికొందరు లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నెల 11న వాంకిడి రేషన్ డీలర్ లబ్ధిదారులకు ఇవ్వకుండానే 39 క్వింటాళ్ల బియాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యం 3,373 క్వింటాళ్లు ఉన్నాయంటే అక్రమ బియ్యం దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఆసిఫాబాద్, రెబ్బెన, బూరుగూడ, వాంకిడి, కాగజ్నగర్, ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి చిన్న చిన్న వాహనాల్లో వెంట్రావ్పేట్కు తరలించి అక్కడి నుంచి మహారాష్ట్రకు తీసుకెళ్తుంటారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యాన్లలో బార్డర్లోని గ్రామాల వరకు తరలించి అక్కడ గోదాముల్లో డంప్ చేస్తుంటారు. అక్కడి నుంచి భారీ వాహనాల్లో గొందియా, బల్హార్షాల్లోని రైస్మిల్లులకు తరలిస్తున్నారు. ఇక్కడ కిలోకు రూ. 12 చొప్పున కొనుగోలు చేసి మాహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కిలోకు రూ. 20 చొప్పున విక్రయిస్తున్నారు.