కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయిల్ పాం విస్తరణ ఆగిపోయినట్లే కనిపిస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కొత్త తోటల సాగు సందిగ్ధంలో పడింది. ఈ ఏడాది మార్చి నాటికి 1048 ఎకరాల్లో ఆయిల్ పాం తోటలను విస్తరించాలని లక్ష్యం పెట్టుకోగా.. నాలుగు నెలలుగా ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 23 మంది రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో 129 ఎకరాల్లో సాగవుతుండగా.. ఇక అక్కడితోనే బ్రేక్ పడేలా ఉంది. అధికారులు తోటలను విస్తరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
కేసీఆర్ హయాంలో ప్రోత్సాహం
రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు కేసీఆర్ సర్కారు ఆయిల్ పాం తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. నష్టాలు లేని సాగు వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకున్నది. మాట్రిక్స్ కంపెనీకి బాధ్యతలు అప్పగించడంతోపాటు మొక్కల సరఫరాలో రైతులకు రాయితీని అందించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రైతులకు మొక్కలను సరఫరా చేసేందుకు మంచిర్యాల జిల్లాలోని భీమారంలో ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేశారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.213 ఉండగా రూ.193 సబ్సిడీని అధికారులు కల్పించారు. మిగతా రూ.20 రైతులు తమ వాటా కింద చెల్లించాల్సి ఉంటోంది. అంతేకాకుండా ఆసక్తి ఉన్న రైతులకు రూ. లక్షతో డ్రిప్లను అందజేసింది.
ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీతో ఇస్తుండగా.. ఇతర రైతులకు 50 శాతం రాయితీతో అందజేస్తున్నారు. రైతులకు ఆర్థికంగా ఉపయోగపడే పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయిల్ పాంల తోటల ఏర్పాటుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అధికారులు చేపట్టిన ప్రాథమిక సర్వేల ప్రకారం జిల్లాలో సుమారు 3వేల ఎకరాలు ఆయిల్ పాం సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. గతేడాది ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా జిల్లాలో 1,048 ఎకరాల్లో తోటలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విడతలవారీగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 129 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అధికారులు మార్చిలోగా టార్గెట్ పూర్తి చేసేందుకు రైతులకు అవగాహన కల్పించి భూములను సిద్ధం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఆగిపోయినట్లు తెలుస్తోంది.