సారంగాపూర్, మార్చి 26 : ఉపాధి హామీ కూలీల హాజరు నమోదుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2023 సంవత్సరం జనవరి నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు హాజరు మస్టర్లలో నమోదు చేసే వారు. ప్రస్తుతం అమల్లో ఉన్న హాజరు విధానం కూలీలను ఇబ్బందులు గురి చేస్తోంది. నిత్యం నెట్వర్క్ పని చేయకపోవడంతో హాజరు నమోదు కావడం లేదు. రోజంతా శ్రమించే కూలీలకు డబ్బు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యాప్ వల్ల నష్టపోతున్నామని వారు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం హాజరు నమోదు కోసం ఫీల్డ్ అసిస్టెంట్లకు కొత్తగా సీయూజీ (కామన్ యూజర్ గ్రూపు) సిమ్కార్డులు అందజేయాలని నిర్ణయించింది. సారంగాపూర్ మండలంలోని 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇటీవల అందజేశారు.
అక్రమాలకు అడ్డుకట్ట…
యాప్ వచ్చిన తర్వాత ఉపాధిలో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. పనికి కూలీ వస్తే తప్ప హాజరు నమోదు చేయడం కుదరదు. గతంలో పనులకు రాకున్నా వచ్చినట్లు నమోదు చేసి ఉపాధి సిబ్బంది కూలీలతో కుమ్మక్కై సొమ్ము కాజేసిన సందర్భాలున్నాయి. సామాజిక తనిఖీల్లో బట్టబయలైనా విషయాలు ఎన్నో జరిగాయి. కొత్తయాప్ విధానంతో అక్రమాలను ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేసేందుకు సాధ్యమైంది. ఈ విధానంలో ఒక కూలీకి సంబంధించి హాజరు రెండు పూటలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే డబ్బులు కూలీల చేతికి అందుతుంది.
నెట్వర్క్ సమస్యలతో ఇబ్బంది…
కొత్తగా అమలు చేస్తున్న యాప్లో నెట్వర్క్ సమస్యతో కూలీల హాజరు నమోదులో ఇబ్బందులు గురవుతున్నామని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వేసవి కాబట్టి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు చేస్తున్నారు. వర్క్ ఐడీ కింద 20 మంది కూలీలకు మించితే గ్రూపు ఫొటో నమోదు చేయాల్సి ఉండేది. ఇందులో కూడా మార్పులు చేశారు. ప్రస్తుతం ఒక వర్క్ ఐడీ కింద ఒక కూలీ పని చేసిన ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కూలీ హాజరు ముందే నమోదు చేయాలి. అనంతరం నాలుగు గంటల విరామం తర్వాతే రెండో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. సారంగాపూర్ మండలంలో 2639 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఏప్రిల్లో కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాంటి సమయంలో నమోదు ప్రక్రియ మరింత ఇబ్బందిగా ఉంటుంది. దీంతో అందుకుగాను ఫీల్డ్ అసిస్టెంట్లకు కామన్ యూజర్ గ్రూపు జియో సిమ్ కార్డులు అందజేశారు. దీనిలో నెలకు 30 జీబీ వరకు డాటాను కూడా ప్రభుత్వం అందించనుంది.
సారంగాపూర్ మండలంలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీల వివరాలు
ఆలూర్లో 15, ఆర్కాయ్తండాలో 27, బీరవెల్లిలో 145, బోరిగాంలో 98, చించోలి(బీ)లో 192, మల్లక్చించోలిలో 251, ధనిలో 3, దుప్యాతండాలో ముగ్గురు, గోపాల్పేట్లో ఒకరు, హన్మాన్తండాలో 164, ఇప్పచెలిమిలో ఒకరు, జామ్లో 367, జౌళిలో ముగ్గురు, కంకెటలో 117, కౌట్ల(బీ)లో 133, కుఫ్టిలో ముగ్గురు, లింగాపూర్లో 28, మహావీతండాలో 139, నాగాపూర్లో112, పెండల్ధరిలో ఆరుగురు, ప్యారమూర్లో 13, పొన్కూర్లో 26, పొట్యాలో 40, రాంసింగ్తండాలో ఇద్దరు, రవీంద్రనగర్లో 37, సాయినగర్లో నలుగురు, సారంగాపూర్లో168, తాండ్ర(జీ)లో 329, వైకుంఠపూర్లో 71, వంజర్లో 140, యాకర్పల్లిలో ఒకరు పని చేస్తున్నారు.
సిమ్కార్డులు అందజేశాం…
ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇది వరకే ప్రభుత్వం ద్వారా వచ్చిన జియో సిమ్ కార్డులను అందజేశాం. ప్రతి రోజూ కూలీల హాజరు నమోదు దీని ద్వారనే జరుగుతుంది. మండలంలో 2639 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
-లక్ష్మారెడ్డి, ఏపీవో, సారంగాపూర్