జన్నారం, ఏప్రిల్ 9 : అటవీ ఆంక్షల పేరిట గోదావరి రేవు నుంచి ఇసుక తరలించకుండా అడ్డుకోవడం వల్ల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోలేక పోతున్నామంటూ జన్నారం మండలం బాదంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదంపెల్లి గోదావరి రేవు నుంచి ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు, గురువారం అక్కడికి వెళ్లిన మంచిర్యాల డీఎఫ్వో శివ్ ఆశీష్సింగ్, జన్నారం ఎఫ్డీవో రాంమ్మోహన్, ఇందన్పల్లి రేంజ్ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి అటవీ అధికారులు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. 2 గంటల పాటు రాస్తారోకో చేశారు.
అధికారులు ఇసుక తరలింపును అడ్డుకోవడం వల్ల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోలేక పోతున్నామని గ్రామస్తులు, ఇసుక తరలింపును అడ్డుకోవడంతో ఉపాధి లేకుండా పోతుందని ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన డీఎఫ్వో శివ్ఆశీష్సింగ్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలా అడ్డుకోవడం సరికాదని, సమస్యలు ఏవైనా ఉంటే ఎఫ్డీవో, డీఎఫ్వో కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేస్తే, వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడీసీ అధ్యక్షుడు కాశేట్టి లక్ష్మణ్, గ్రామస్తులు లక్ష్మీనారాయణ, లక్ష్మీరాజాం,తిరుపతి పాల్గొన్నారు.