కౌటాల, ఏప్రిల్ 27 : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ను ఆయన పరిశీలించారు. అందులోని బ్రేకర్ల పనితీరు, కెపాసిటీ, ఏఏ సబ్ స్టేషన్లకు ఇక్కడ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది, ఎంత వినియోగం అవసరముంది, విద్యుత్ సరఫరాలో జరిగే అంతరాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సబ్స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగజ్నగర్లోని ఈస్గాం 132/33 కేవీ సబ్స్టేషన్ నుంచి కౌటాల వరకు 33 కేవీ విద్యుత్లేన్ పూర్తిగా అటవీ ప్రాంతం గుండా ఉండడం వల్ల వర్షాలు, గాలులు వచ్చినప్పుడు సమస్యలు తలెత్తుతున్నట్లు ఆయన తెలిపారు. కౌటాల నుంచి గుండాయిపేట, రవీంద్రనగర్, రెబ్బెన, బెజ్జూర్ వరకు 33 కేవీ విద్యుత్ సరఫరా జరుగుతుందని, అయితే కాగజ్నగర్ ఈస్గాం నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల నిత్యం సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.
తలోడి గ్రామ శివారులో నిర్మిస్తున్న 132/33 కేవీ సబ్స్టేషన్ పనులు ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి కావాల్సి ఉందని, ఆ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారుకు సూచించారు. 132/33 సబ్ స్టేషన్ మ్యాప్, విద్యుత్ లేన్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సబ్ స్టేషన్ పూర్తయితే దాదాపు విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. ఆయన వెంట ఎస్ఈ వాసుదేవ్, డీఈ నాగరాజ్, ఏడీఈ రాజేశ్వర్, ఏఈ రవీందర్, విద్యుత్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.