మంచిర్యాల అర్బన్, జనవరి 21 : జిల్లాలోని మంచిర్యాల(బాలికలు), బెల్లంపల్లి(బాలికలు), చెన్నూర్ (బాలుర) మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఐదో తరగతిలో 200 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 240 సీట్లు భర్తీ చేయనున్నది.
జిల్లాలోని మూడు మైనార్టీ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్లైన్ఆన్లైన్( www.tmreistelanga na.cgg.gov.in )లో దరఖాస్తుల స్వీకరణకు మైనార్టీ సంక్షేమశాఖ అవకాశం కల్పించింది. వీటితో పాటు ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నది.
మంచిర్యాల, చెన్నూర్ పాఠశాలల్లో ఐదో తరగతిలో 80 సీట్లు, బెల్లంపల్లి పాఠశాలలో 40 సీట్ల చొప్పున 200 సీట్లు, మంచిర్యాల, బెల్లంపల్లి కళాశాలల్లో ఎంపీసీ 40, బైపీసీ 40 సీట్ల చొప్పున మొత్తం 160 సీట్లు, చెన్నూర్ కళాశాలలో సీఈసీ 40 సీట్లు, హెచ్ఈసీ 40 సీట్ల చొప్పున రెండు గ్రూపులకు 80 సీట్లను భర్తీ చేయనున్నది. అలాగే 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా నింపనున్నారు.
నూతన అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతమైతే రూ. 1.50 లక్షలు, పట్టణమైతే రూ. 2 లక్షలు ఉండాలి. అలాగే 75 శాతం మైనార్టీలు, 12 శాతం బీసీలు, ఆరుశాతం ఎస్సీలు, నాలుగు శాతం ఎస్టీలకు, రెండు శాతం ఓబీసీలకు సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ అమలు చేస్తారు. ఈ లెక్కన 80 సీట్లకుగాను 51 ముస్లిం మైనార్టీలకు, బీసీ(సీ)కి ఐదు సీట్లు, నాలుగు సీట్లు సిక్కు, జైనులు, పార్శీలు, బుద్దులకు, మరో 20 సీట్లు నాన్ మైనార్టీలకు కేటాయిస్తారు.
మైనార్టీ గురుకులాల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు మెరుగైన విద్యనందిస్తున్నారు. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, క్రీడా దుస్తులు, కాస్మోటిక్స్ ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, నెలలో ఆరుసార్లు మాంసంతో భోజనం అందిస్తారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు విద్యార్థులకు అందుబాటులో వైద్య సిబ్బంది ఉంటారు.
విద్యార్థులు వెబ్సైట్, టెమ్రీస్ యాప్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్లకు సంబ.ంధించిన వివరాల కోసం మీ సేవ కేంద్రాలు, మైనార్టీ గురుకులాలు, కలెక్టరేట్లోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఆసక్తి గల మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు), నాన్ మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– దమయంతి, ప్రిన్సిపాల్, మైనార్టీ పాఠశాల/కళాశాల, మంచిర్యాల