నిర్మల్ అర్బన్, జూన్ 28 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) విద్యార్థినులతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ సర్కారు విద్యారంగానికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ విద్యా విధానాన్ని పటిష్టం చేసింది. దీనికితోడు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంతో బాలికలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇన్నాళ్లు ప్రైవేట్ బడులపై ఆసక్తి చూపిన తల్లిదండ్రులు.. తమ పిల్లలను కేజీబీవీలకు పంపేందుకు మొగ్గు చూపుతుండడంతో సీన్ రివర్స్గా మారింది. జి ల్లాలో 18 కేజీబీవీలుండగా.. అన్ని చోట్ల సొం త భవనాలు (కొన్ని నిర్మాణ దశలో), పూర్తి స్థా యిలో ఉపాధ్యాయులున్నారు. దీనికితోడు వి ద్యార్థినుల భద్రతను నిరంతరం పర్యవేక్షించే ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్లను తలదన్నే వసతులతో క్లాస్రూమ్లు, రుచికరమైన భోజనం, నాణ్యమైన విద్యాబోధన, ప్రైవేట్కు దీటుగా ఇం గ్లిష్ మీడియం చదువులు, అత్యుత్తమ ఫలితాల సాధన వెరిసి విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం పోటీ పెరిగింది. ప్రైవేట్ ఫీజుల భారం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. పాఠశాలల ప్రారంభం నాటికే 80 శాతం అడ్మిషన్లు పూర్తికాగా, అనంతరం కొద్ది రోజులకే సీట్లన్నీ భర్తీ అయ్యాయి. నిర్మల్ జిల్లాలోని 18 పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థినులు చేరడంతో అన్ని చోట్ల ‘అడ్మిషన్ క్లోజ్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
జోరుగా అడ్మిషన్లు..
జిల్లాలో మొత్తం 19 మండలాలుండగా.. బాసర మినహా ప్రతి మండలంలో ఒకటి చొప్పు న 18 కస్తూర్బా పాఠశాలలున్నాయి. వీటిలో 6-10వ తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతున్నది. ఒక్కో తరగతికి 40 మందికి మాత్రమే ప్రవేశాలు ఉండగా, ప్రతి ఏటా ఆరోతరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. వివిధ కారణాలతో మిగతా తరగతుల్లో విద్యార్థినుల ఖాళీలు ఏర్పడితే కొత్తగా అడ్మిషన్లు తీసుకుంటారు. ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తుండగా.. స్కూళ్లు ప్రారంభమైన వారం, పది రోజుల్లోనే పూర్తిస్థాయిలో విద్యార్థినులు ప్రవేశాలు పొందారు. వచ్చేనెల బడిబాట పూర్తయ్యే వరకు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్ననప్పటికీ అంతకంటే ముందుగానే సీట్లన్నీ భర్తీ కావడం గమనార్హం.
‘నో అడ్మిషన్’ బోర్డులు..
ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థినులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం, రాష్ట్రస్థాయిలో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంతో పోటీ మరింత పెరిగింది. ఈ పాఠశాలల్లో చదువుతోపాటు యోగా, క్రీడల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 18 కేజీబీవీల్లో మొత్తం 720 సీట్లకు గాను ఇప్పటి వరకు 1,034 మంది విద్యార్థినులు పాఠశాలల్లో చేరారు. అంటే అదనంగా 314 మందికి ప్రవేశాలు కల్పించారు. ఒక్కో పాఠశాలలో 40 మంది విద్యార్థినులు చేరాల్సి ఉండగా, సగటున 57 మంది చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. నూతనంగా ఏడో తరగతిలో 176 మంది, ఎనిమిదిలో 153, తొమ్మిదిలో 75, పదో తరగతిలో 9 మంది చొప్పున విద్యార్థిను లు అడ్మిషన్లు పొందారు. ఈ లెక్కన మొత్తం 1,447 అడ్మిషన్లు వచ్చాయి. దీంతో కస్తూర్బా లు కళకళలాడుతుండగా.. నిర్మల్ అర్బన్, సోన్, మామడ, కుంటాల, నర్సాపూర్తో పాటు అన్ని చోట్ల నో అడ్మిషన్ బోర్డులు దర్శమిస్తున్నాయి.
98.99 శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని కేజీబీవీలు పదిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 690 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరుకాగా.. 683 పాసయ్యారు. 98.99 శాతం ఉత్తీర్ణత సా ధించారు. 18 పాఠశాలల్లో 14 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించడం గమనార్హం. ఇందులో తొమ్మిది మంది 10 జీపీఏ సాధించగా, అత్యధికంగా సోన్ కేజీబీవీ నుంచి ఆరుగు రు, దస్తురాబాద్, దిలావర్పూర్, పెంబి నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
నాణ్యమైన విద్య అందిస్తున్నాం..
కస్తూర్బా పాఠశాలల్లో చదివే విద్యార్థినులందరికీ నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అమ్మాయిలకు పూర్తి భరోసా కల్పించేదిశగా నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించడం, పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు నిస్సంకోచంగా ముందుకొస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యావిధానంతో కేజీబీవీల్లో అడ్మిషన్లు నిండిపోయాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారీ ఖాళీల కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థినులకు ప్రవేశం కల్పించాం.
– శ్రీదేవి, సెక్టోరియల్ ఆఫీసర్, నిర్మల్ జిల్లా
విద్యార్థినులపై నిరంతర పర్యవేక్షణ
ప్రతి విద్యార్థినిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. చదువులో వెనుకబడిన విద్యార్థినులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. చదువుతో పాటు విద్యార్థినులకు వ్యాయామం, యోగా, క్రీడలు నిర్వహిస్తాం. బోధన, బోధనేతర సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. విద్యార్థినులు సాధించే మార్కులు, ఉత్తీర్ణత తదితర వాటిపై ఉపాద్యాయులతో సమీక్ష నిర్వహించి తల్లిదండ్రులకు వివరిస్తాం.
– ఎస్ వీణ, స్పెషల్ ఆఫీసర్, మందపల్లి (పెంబి) కస్తూర్బా
ఇంటర్ వరకు ఇటే..
మాది భైంసా మండలంలోని మహాలింగి గ్రామం. ప్రస్తుతం నేను సోన్ కేజీబీవీలో ఆరో తరగతి చేరా. ఇంతకంటే ముందు ఐదో తరగతి వరకు భైంసాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నా. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ చదివిస్తున్నారు. కేజీబీవీలో చేరడంతో మా తల్లిదండ్రులకు ఫీజుల ఇబ్బందులు దూరమయ్యాయి. ఇక ఇంటర్ వరకు ఇక్కడే ఉచితంగా చదువుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
– బీ రాఘవి, ఆరో తరగతి, సోన్ కేజీబీవీ